Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?
- February 5, 2026 / 06:11 PM ISTByFilmy Focus Writer
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ ఈసారి న్యాయపోరాటంగా మారింది. పండగకు విడుదలైన వరుస సినిమాల నిర్మాతలు ఇప్పుడు ఒక యూట్యూబర్పై కోర్టుకెక్కడం ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రముఖ యూట్యూబర్ బార్బెల్ (సుశాంత్) తన రివ్యూల ద్వారా సినిమాలను కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నాడని, దీనివల్ల తమకు భారీ నష్టాలు వస్తున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sankranthi Movies
‘ది రాజా సాబ్’ మినహా, సంక్రాంతి రేసులో నిలిచిన దాదాపు అన్ని పెద్ద సినిమాల మేకర్స్ ఈ న్యాయపోరాటంలో భాగమయ్యారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘అనగనగా ఒక రాజు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘నారి నారి నడుమ మురారి’ చిత్రాలకు సంబంధించిన టీమ్స్ ఇప్పటికే సుశాంత్పై కేసులు ఫైల్ చేశారు. బార్బెల్ చేసే కామెంట్స్ కేవలం విమర్శల స్థాయిని దాటి, వ్యక్తిగత దూషణలు టీమ్ కష్టాన్ని కించపరిచేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.
నిర్మాతల వాదన ప్రకారం, ఒక సినిమా బాగుందో లేదో ప్రేక్షకులు నిర్ణయించాలి, కానీ యూట్యూబ్ రివ్యూలు ఆడియన్స్ థియేటర్కు రాకముందే నెగటివ్ ఒపీనియన్ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ రివ్యూల ప్రభావం ఎక్కువగా ఉంటోందని, ఇది సినిమా వసూళ్లను దెబ్బతీస్తోందని వారు కోర్టును ఆశ్రయించారు. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప, సినిమాను పూర్తిగా చంపేలా ఉండకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఒకవైపు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నెటిజన్లు మాట్లాడుతుంటే, మరోవైపు ఒక సినిమా వెనుక ఉన్న వందల కుటుంబాల శ్రమను గుర్తించాలని ఇండస్ట్రీ మద్దతుదారులు కోరుతున్నారు. నిజాయితీగా రివ్యూలు చెప్పడం తప్పా? లేక కావాలనే ఒక సినిమాను టార్గెట్ చేయడం కరెక్టా? అనే పాయింట్ మీద ఇప్పుడు పెద్ద వార్ నడుస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిర్మాతలు తీసుకున్న ఈ లీగల్ స్టెప్ ఫ్యూచర్లో ఇతర యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.














