హీరోల యందు శ్రీవిష్ణు వేరయా.. అంటుంటారు. ఆయన ఎంచుకునే కథలు, ఆ సినిమాల్లో మేనరిజమ్స్.. అన్నీ డిఫరెంట్గానే ఉంటూ వస్తున్నాయి. రెండు మిక్స్ అవ్వడంతో అదిరిపోయే ఫలితాలు వస్తున్నాయి. ఆ జోష్లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీవిష్ణు.. ఇప్పుడు మూడో సినిమాను ఓకే చేశాడు అని సమాచారం. అది కూడా హిట్ కాంబినేషన్ రిపీట్ అని అంటున్నారు. తనకు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి కలసి సినిమా చేయబోతున్నాడట.
‘#సింగిల్’ సినిమా విజయంతో జోరుమీదున్న శ్రీవిష్ణు ప్రస్తుతం ‘మృత్యుంజయ్’, ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్లు ముగింపు దశలో ఉన్నాయి. దీంతో మరో కథను ఓకే చేసి పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. తనకు ‘సామజవరగమన’ లాంటి హిట్ బొమ్మను అందించిన రామ్ అబ్బరాజుతో రెండో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చేస్తారట. ఆ సినిమాలాగే ఇది కూడా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు.

మార్చి నుండి రామ్ అబ్బరాజు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరా సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక దీంతోపాటు సన్నీ సంజయ్ డైరక్షన్లో సినిమా చేస్తాడట. ఓటీటీ సినిమా ‘అనగనగా’తో సన్నీ ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయం. ఆ సినిమా రూట్లోనే భావోద్వేగాల సమ్మిళతంగా ఈ కథ కూడా ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మిస్తారట.

ఈ సినిమాలు ఇలా ఉండగా గీతా ఆర్ట్స్ వారి జీఏ2 బ్యానర్లో ఓ సినిమాకు శ్రీవిష్ణు ఓకే చెప్పాడట. తన గత సినిమాల్లో ఓ హిట్ సినిమా టీమ్ సభ్యుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా మూడు ప్రాజెక్టులను రెడీ చేసుకున్నాడు శ్రీవిష్ణు. భలే ప్లానింగ్ కదూ..
