కోలీవుడ్కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?
- February 25, 2026 / 04:30 PM ISTByFilmy Focus Desk
తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలు రావు.. ఈ మాట మనం ఎన్నో ఏళ్ల నుండి వింటూనే ఉన్నాం. అదే సమయంలో తమిళ సినిమా పరిశ్రమలో వీరికి వరుస ఛాన్స్లు వస్తాయి. ఒకానొక సమయంలో ఆమె తమిళ హీరోయినే, తెలుగులో అప్పుడెప్పుడో నటించింది అనేలా పరిస్థితి మారిపోతుంది. ఇలా అనిపించుకున్న గత హీరోయిన్లు అంటే బిందు మాధవి, శ్రీదివ్య, రక్షిత/ ఆనంది లాంటి వాళ్ల పేర్లు వినిపిస్తాయి. ఇప్పుడు ఆ లిస్ట్లోకి వైష్ణవి చైతన్య వెళ్లబోతోందా?
Vaishnavi Chaitanya
అక్కడివరకు పరిస్థితి వెళ్తుందో లేదో తెలియదు కానీ.. ఆమె తొలి తమిళ సినిమా మాత్రం ఓకే అయింది అని చెబుతున్నారు. ‘బేబీ’ సినిమాతో హీరోయిన్గా మారిన తర్వాత తెలుగులో హీరోయిన్గా వరుస సినిమాలు చేసినా ఆశించిన ఫలితం అందుకోని వైష్ణవి ఇప్పుడు కోలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు జీవీ ప్రకాశ్ స్వీయ నిర్మాణంలో నటించేందుకు రెండు సినిమాలను రెడీ చేస్తున్నారు.

వాటిలో ఓ సినిమాలో వైష్ణవి చైతన్యను హీరోయిన్గా ఎంపిక చేశారు అని చెబుతున్నారు. జీవి ప్రకాశ్ తన సొంత బ్యానర్ పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘జో’ సినిమా ఫేమ్ హరిహరణ్ రామ్ డైరక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా మళవిక మనోజ్ను ఎంపిక చేశారట. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని సమాచారం.
ఇక ఇదే బ్యానర్ మీద ‘హాట్ స్పాట్’ సినిమా ఫేమ్ విఘ్నేశ్ కార్తిక్ డైరక్షన్లో మరో సినిమాను ఓకే చేశారట జీవీ ప్రకాశ్. ఆ సినిమాలో వైష్ణవి చైతన్యను కథానాయికగా అనుకుంటున్నారని సమాచారం. తొలి సినిమా తర్వాత ఇది మొదలవ్వొచ్చు అని సమాచారం. ఈ రెండు సినిమాల అనౌన్స్మెంట్ త్వరలో ఇస్తారని చెబుతున్నారు. వైష్ణవి ‘బేబీ’ సినిమా తర్వాత ‘లవ్ మీ’ ‘జాక్’ అని రెండు సినిమాలు చేసింది. అయితే ఆ రెండూ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ‘ఎపిక్’ అనే సినిమాలో నటిస్తోంది.
















