The Pride Bharat Chhatrapati: ఎవరీ వీరనాడి బెలవాడీ మల్లమ్మ.. రెడీ అయిన సినిమా?
- July 29, 2026 / 02:38 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ బాలీవుడ్ కథానాయిక భూమి పెడ్నేకర్ ఓ కొత్త సినిమాను ఓకే చేసింది. అదే ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహరాజ్’. ఈ సినిమా గురించి మీరు ఇప్పటికే వినే ఉంటారు. కన్నడ స్టార్ దర్శక నటుడు రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. ఆ సినిమాలో బెలవాడీ మల్లమ్మ అనే పాత్రలో భూమి నటిస్తోందని చిత్రబృందం ప్రకటించింది. ఎవరామె అని చూస్తే.. ఛత్రపతి శివాజీ సైన్యంతో తలపడిన వీరనారి అని తెలిసింది. మరి ఆ కథేంటో చూద్దామా.
The Pride Bharat Chhatrapati
సుమారు 600 ఏళ్ల క్రితం నాటి కథ ఇది. ఆ రోజుల్లో ఓ అమ్మాయి విలు విద్య, గుర్రపు స్వారీ, ఫెన్సింగ్, జావెలిన్ త్రోలో లాంటి క్రీడల్లో శిక్షణ పొందింది. తన స్వయంవరంలో భాగంగా ఎక్కువ పులులను వేటాడి విజేతను వివాహం చేసుకుంటా అని ప్రకటించింది. ఆ తర్వాత తన భర్తను చంపిన శివాజీ సైన్యంతో వీరోచితంగా పోరాడింది. ప్రస్తుత కర్ణాటకలోని సోదె ప్రాంతాన్ని పాలించిన మధులింగ నాయక కుమార్తె ఈ మల్లమ్మ.
ఒక్క నెలలో తమ వయసు కన్నా ఎక్కువ పులులను వేటాడిన వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మధులింగ నాయక ఆహ్వానం పంపారు. బెలవాడీ యువరాజు అయిన 20 ఏళ్ల ఈశ ప్రభు ఒక్క నెలలోనే 21 పులులను చంపి విజేతగా నిలిచాడు. దీంతో మల్లమ్మ అతణ్ని మనువాడి బెలవాడీ రాణిగా వెళ్లింది. బెలవాడీ రాజ్యానికి 10 వేల మంది సైన్యం ఉండేది. మల్లమ్మ అప్పట్లోనే మహిళా శక్తికి ప్రాధాన్యమిచ్చి, 5 వేల మంది స్త్రీలతో ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పాటు చేశారట.

తంజావూరును శివాజీ సైన్యం స్వాధీనం చేసుకున్నాక, కొంతమంది సైనికులు బెలవాడీ రాజ్యంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో పాల కోసం స్థానికుల ఆవులను బంధించారు. విషయం తెలుసుకున్న మల్లమ్మ మహిళా సైన్యంతో మరాఠా సైనికుల శిబిరంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో శివాజీ సైనిక బలగానికి నష్టం జరిగింది. దీంతో ఆవులను వెనక్కి తిరిగిచ్చారు. అయితే తన సైన్యంపై జరిగిన దాడిని తెలుసుకున్న శివాజీ ఆగ్రహంతో బెలవాడీ రాజ్యంపై దండెత్తడానికి భారీ సంఖ్యలో సైన్యాన్ని పంపించారు.
ఆ యుద్ధంలో ఈశ ప్రభు మరణించినా మల్లమ్మ తలవంచలేదు. సమరాన్ని కొనసాగించి మరో 27 రోజుల పాటు శివాజీ సైన్యాన్ని నిలువరించగలిగారు. ఆ తరువాత మరాఠా సైన్యం ఆమెను బంధించి శివాజీ దగ్గరకు తీసుకెళ్లారు. ఓ మహిళ తన సైన్యాన్ని అన్ని రోజులు ఎదుర్కోవడం శివాజీని ఆశ్చర్యపరిచిందట. మల్లమ్మ ధైర్యసాహసాలను చూసి ఆమెను దుర్గా భవానీ ప్రతిరూపంగా భావించారట. అంతేకాదు ఈశ ప్రభు చంపినందుకు శివాజీ ఆమెను క్షమించమని అడిగినట్టు చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి..















