చిరంజీవితో సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి మాస్ ఆలోచనలు చేస్తున్నారు. కథలో ఇప్పటికే పూర్తిగా మాస్, ఫన్నీ ఎలిమెంట్స్ను యాడ్ చేసిన అనిల్.. ఇప్పుడు హీరోయిన్ల విషయంలో అంతకుమించి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ని, మరో ప్రామిసింగ్ మాస్ బ్యూటీని ఎంచుకున్నారు అని సమాచారం. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ పనులు ఓ కొలిక్కి వచ్చాయి అని చెబుతున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ ‘ఎమ్మెల్యే’ని ఫిక్స్ చేశారు అని సమాచారం.
అల్లు అర్జున్తో ‘సరైనోడు’ సినిమాలో ‘ఎమ్మెల్యే’ అని పిలిపించుకున్న కేథరిన్ థ్రెసాను అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కోసం ఓకే చేశారని తెలుస్తోంది. సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఆమెను తీసుకున్నారు అని అంటున్నారు. కాస్త మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ అంశాలను టచ్ చేసే పాత్రగా ఆ క్యారెక్టర్ ఉంటుంది అని సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి, కేథరిన్ కలసి నటించడం కొత్తేమీ కాదు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇప్పటికే ఓసారి నటించారు. అయితే అందులో మరదలుగా కనిపించింది. ఇప్పుడు హీరోయిన్ అవుతోంది.
ఇక కేథరిన్ కెరీర్ చూస్తే.. కెరీర్ ప్రారంభం పెద్ద హీరోల సినిమాలతోనే జరిగింది. వరుస ఛాన్స్లు వచ్చినా స్టార్ హోదాను అందుకోవడం ఇబ్బందులు పడింది. ఆ తర్వాత ప్రత్యేక గీతాలు, చిన్న పాత్రలకు పరిమితం అయిపోయింది. మరిప్పుడు చిరంజీవి సినిమాతో కెరీర్ ఏమన్నా పుంజుకుంటుందేమో చూడాలి. తెలుగులో అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత చిరంజీవి సినిమానే చేస్తోంది. తమిళంలో ‘గ్యాంగర్స్’ అనే ఓ సినిమా మాత్రం చేసింది. అంటే కెరీర్లో హిట్ చాలా కీలకం.
ఇక #చిరుఅనీల్ సినిమా గురించి చూస్తే.. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ నయనతార ఫిక్స్ అయింది అని సమాచారం. త్వరలోనే ఘనంగా అనౌన్స్మెంట్లు ఉంటాయి అని అంటున్నారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయనతార.. చిరంజీవికి సోదరిగా నటించిన విషయం తెలిసిందే.