Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్ చరణ్… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్
- February 26, 2026 / 01:06 PM ISTByFilmy Focus Desk
మన దగ్గర మనోభావాల బ్యాచ్ చాలా ఎక్కువమందే ఉంటారు. ఒక చిన్న పాయింట్ని పట్టుకుని మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే మాటనే పక్కన పెట్టేసి ముందుకెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి వారిలో కొంతమంది గత కొన్ని రోజులుగా అల్లు – కొణిదెల కుటుంబానికి సంబంధించిన ఓ ఫొటోను పట్టుకొని నానా హంగామా చేస్తున్నారు. అలా ఎలా చేస్తారు, అలా ఎలా వస్తారు అంటూ ఆందోళన చెందుతున్నారు.
Allu Sirish
అంతలా ఏమైంది అంటే.. మొన్నీమధ్య అల్లు వారి కుటుంబం సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. అల్లు శిరీష్ పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సందళ్లలో బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఓ పార్టీ జరిగింది. దానికి రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా వెళ్లారు. చరణ్ అయ్యప్ప స్వామి మాలలోనే అక్కడికి వెళ్లడంతో ‘అలా ఎలా పార్టీకి మాలలో వెళ్తారు?’ అంటూ ఓ పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది శిరీష్ సోషల్ మీడియా పోస్టుల కింద కామెంట్స్ చేశారు కూడా. అందులో ఓ కామెంట్కి శిరీష్ రిప్లై ఇచ్చారు.

దాని ద్వారా ఆ పార్టీ జరిగిన రోజు ఏమైంది అనే వివరాలు బయటకు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక నెటిజన్ ‘చరణ్ స్వామి’ అని కామెంట్ పెట్టాడు. దానికి అల్లు శిరీష్ స్పందిస్తూ కామెంట్ పెట్టారు. పార్టీలో ఎవరూ ఆల్కహాల్ ముట్టకముందే చరణ్ స్వామి పార్టీకి వచ్చాడని.. తమను విష్ చేసి అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. అయ్యప్పస్వామి పట్ల చరణ్ ప్రేమ, నిబద్ధత వేరని శిరీష్ రాసుకొచ్చాడు.
రామ్ చరణ్ వెళ్లిన తర్వాతే తమ పార్టీ మొదలైందని క్లారిటీ ఇచ్చారు. మాలలో ఉన్నప్పుడు రామ్ చరణ్ బయట కనీసం నీళ్లు కూడా తీసుకోడు అని కూడా శిరీష్ చెప్పుకొచ్చాడు. అల్లు శిరీష్ – నయనిక పెళ్లి మార్చి 6న జరగనున్న విషయం తెలిసిందే.















