Balakrishna: థియేటర్ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్
- May 26, 2026 / 12:42 PM ISTByFilmy Focus Desk
సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం అద్దె విధానంలో మాత్రమే సినిమాలను ప్రదర్శిస్తామని థియేటర్ల ఓనర్లు నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో థియేటర్ల విషయంలో టాలీవుడ్లో ఓ రకమైన చర్చ జరుగుతుండగా.. ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు అనే చర్చ మరోవైపు నడుస్తోంది. ఈ విషయంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని కలసి మాట్లాడారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ నందమూరి బాలకృష్ణ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి.
Balakrishna
ప్రస్తుతం సినిమాను బతికించాల్సిన పరిస్థితుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) ఛైర్మన్గా భరత్ భూషణ్ ఇటీవల పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే బాలకృష్ణ ఈ మాటలు మాట్లాడారు. టాలీవుడ్ నుండి ఎక్కువ సినిమాలు రావాలి. వాటిని ప్రేక్షకులకు థియేటర్లు అందించాలి అని అన్నారు బాలయ్య.
కష్టాలు వచ్చినప్పుడు అందరం ఒక కుటుంబంలా కలసి కూర్చొని సమస్య పరిష్కరించుకోవాలి. ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలి. సాధారణంగా సినిమాలకు ఆంధ్రప్రదేశ్ నుండి కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఆ లెక్కన ఏపీలో పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అని బాలయ్య అభిప్రాయపడ్డారు. సమస్యలు పరిష్కరించడం సహా, ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ ద్వారా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయన్నారు.
తెలుగు సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులను చూస్తుంటే జాలేస్తోంది. చాలామంది థియేటర్లకు తాళాలు వేసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తగిన సహకారం అందించాలని కోరతాం అని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
టాలీవుడ్లో మంచి సినిమాలు చేయాలి. అనుకరణ లేకుండా, మన సత్తాకు పదును పెడుతూ సందేశాత్మక చిత్రాలు మన దగ్గర తీస్తున్నారు. ఈ ప్రయత్నాలు తృప్తినిస్తున్నాయి . టెక్నిక్, టెక్నాలజీలు లేనప్పుడు కూడా సినిమాలు త్వరగా పూర్తయ్యేవి. ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగినా సినిమాలు ఆలస్యమవుతున్నాయి అని అన్నారు బాలయ్య.












