ఏదైనా సినిమా పుకార్లలో పుట్టి.. పుకార్లలో పెరిగి.. పుకార్లలో క్యాన్సిల్ అయ్యాక.. అనౌన్స్మెంట్ అయి తర్వాత క్యాన్సిల్ అవ్వడం ఎప్పుడైనా చూశారా? టాలీవుడ్లో జరిగిన ఓ బాలీవుడ్ సినిమా బ్యాగ్రౌండ్ కథ ఇది. మేం చెప్పేది ‘బ్రహ్మ రాక్షస’ సినిమా గురించేనండి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించతలపెట్టిన సినిమా ఇది. ఈ సినిమా గురించి చాలా రకాల పుకార్లు వచ్చి.. దాదాపు ప్రాజెక్ట్ లీక్ అయింది. ఇంతలో సినిమా ఆగిపోయింది అని తెలిసింది. అక్కడికి కొద్ది రోజులకే సినిమా అనౌన్స్ చేసి.. క్యాన్సిల్ అని చెప్పింది టీమ్.
అయితే, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్లోకి అప్పటి వరకు అనుకున్న బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ బదులు ప్రభాస్ వచ్చాడు. అప్పటికే వరుస సినిమాలు ఓకే చేసుకొని, సెట్స్ మీద పెట్టుకున్న ప్రభాస్ ఈ సినిమా చేస్తాడు అని వార్తలు రావడంతో పెద్దగా ఎవరూ నమ్మలేదు. అయితే లుక్ టెస్ట్ జరిగింది అని ట్రస్టెడ్ సోర్సెస్ నుండి సమాచారం రావడంతో ఈ ప్రాజెక్ట్ ఉందని తేలింది. అయితే సినిమాను ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. దీంతో ప్రాజెక్ట్ ఇక లేదు అనుకున్నారంతా. కానీ ఆ ప్రాజెక్ట్ ఉందట.. అంతేకాదు ప్రీప్రొడక్షన్ కూడా జరుగుతోందట.
అవును, మీరు చదివింది నిజమే. ప్రశాంత్ వర్మ సైలెంట్ ‘బ్రహ్మరాక్షస్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపు పూర్తి చేసేశారట. సినిమా ప్రతీ సీన్, ప్రతీ షాట్ ప్రీ విజువలైజేషన్ చేయించారట. దీని వల్ల మేకింగ్లో సమయం ఆదా చేసుకుంటారట. అంతేకాదు నేపథ్య సంగీతం కూడా ముందే డిజైన్ చేసుకుంటున్నారట. దాంతో సమయం, డబ్బు ఆదా అవుతాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలను పూర్తి చేసుకొని ప్రశాంత్ వర్మ ‘బ్రహ్మ రాక్షస’కి వస్తారని టాక్. ఈ ఏడాది ఆఖరులో సినిమా అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది అని చెబుతున్నారు.