దేశంలో ఎక్కువమందికి చేరిన సినిమా సిరీసుల్లో ‘దృశ్యం’ ఒకటి. తొలుత మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal)– జీతూ జోసెఫ్ (Jeethu Joseph) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీకి వెళ్లింది. వెళ్లిన అన్ని చోట్లా సినిమా కథకు విజయమే దక్కింది. తెలుగులో వెంకటేశ్ (Venkatesh) చేయగా, తమిళంలో కమల్ హాసన్ (Kamal Haasan) చేశారు. ఇక హిందీలో అజయ్ దేవగణ్ (Ajay Devgn) నటించారు. ఆ తర్వాత ‘దృశ్యం 2’ తెలుగు, హిందీలో మాత్రమే వచ్చింది. అన్నింటా ఒకటే కథ. అయితే ‘దృశ్యం 3’ (Drishyam 3) విషయానికొచ్చేసరికి కథ మారుతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు ఏది ముందు రిలీజ్ అనే చర్చ కూడా జరుగుతోంది.
తాజాగా, ఈ విషయంలో మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ కథ వివిధ భాషల్లో, వివిధ దర్శకుల చేతుల్లో, వివిధ నటులతో ఒకేసారి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తేలింది. మలయాళంలో జీతూ జోసెఫ్ (Jeethu Joseph) రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో ‘దృశ్యం 3’గా తెరకెక్కిస్తారని ఆయన స్పష్టం చేశారు. వేరొక కథతో ‘దృశ్యం3’ హిందీ వెర్షన్ వస్తుందని వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదు.
హిందీ సినిమా కూడా నేను రాసిన కథతోనే తెరకెక్కనుంది. స్క్రిప్ట్ పని పూర్తయింది. తుది మెరుగులు దిద్దుతున్నామని తేల్చేశారు. స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైతే.. హిందీ మూవీ టీమ్కు అందజేస్తానని జీతూ చెప్పారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటారు అని క్లారిటీ ఇచ్చారు. అయితే తెలుగు సంగతి ఏంటి అనేది ఆయన చెప్పలేదు. ఇక్కడ సినిమాను వెంకటేశ్ (Venkatesh) హీరోగా తెరకెక్కిస్తారు అనేది క్లారిటీ.
మరి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. జీతూనే చేసేటట్లయితే ఇప్పటికే ఆ మాట అనేవారు. అంటే తెలుగులో వేరే దర్శకుడితో సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారో చూడాలి. ఎందుకంటే మూడు భాషల్లో ఒకేసారి అంటే కొత్త అంశమే.