Jai Hanuman: ‘జై హనుమాన్’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ బయటకు..
- February 23, 2026 / 02:27 PM ISTByFilmy Focus Desk
‘జై హనుమాన్’.. సుమారు ఏడాదిన్నర క్రితం అనౌన్స్ అయిన సినిమా ఇది. ‘హను – మాన్’ సినిమా ఇచ్చిన విజయానందంలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం అని కూడా చెప్పారు. అయితే ఏమైందో ఏమో సినిమా స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఈ సినిమా ఉందా? లేదా? అనే చర్చ కూడా జరిగింది. ఇక ఉండకపోవచ్చు లాంటి నెగిటివ్ టాక్లు కూడా బయటకు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆదివారం నాడు సినిమాను స్టార్ట్ చేసేశారు.
Jai Hanuman
ఈ సినిమాను హనుమంతుడి జన్మస్థలంగా విశ్వసించే హంపీలోని అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ క్లాప్ కొట్టగా.. అనిల్ తడానీ కెమెరా స్విచ్చాన్ చేశారు. తేజ సజ్జ గౌరవ దర్శకత్వం వహించాడు. కలియుగం నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ చిత్రమిది. దీంట్లో పురాణ అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. హనుమంతుడి భక్తి, విశ్వాసం, బలానికి ప్రతీకలా ఈ సినిమా నిలవనుందని టీమ్ తెలిపింది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తామని తెలిపారు.

‘హను – మాన్’ సినిమాలో నటించిన తేజ ‘జై హనుమాన్’ సినిమాలో అదే పాత్రలో నటిస్తాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘హను – మాన్’ సినిమా క్లైమాక్స్లో చూపించినట్లు శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అనే నేపథ్యంతో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. అయితే సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సమయంలో సినిమా షూటింగ్ ప్రారంభించడం గమనార్హం.
‘జై హనుమాన్’ సినిమా విషయంలో ‘హను – మాన్’ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి పంచాయితీ పెట్టారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ‘హను – మాన్’ సినిమాను నిర్మించడమే కాక సీక్వెల్ కోసం ఖర్చు పెట్టానని.. కానీ ఇప్పుడు తనను కాదని, మైత్రీ వాళ్లకు ప్రశాంత్ వర్మ చేస్తుండటంతో నిరంజన్ రెడ్డి ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎం.ఎం.కీరవాణిని ఎంచుకున్నారు.












