‘సాహసం..’పై గౌతమ్ మీనన్ మనోగతం..!
- November 16, 2016 / 10:01 AM ISTByFilmy Focus
‘ఏ మాయ చేశావే’ తర్వాత గౌతమ్ మీనన్ – నాగ చైతన్య కలయికలో వచ్చిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యేటపుడు ఉండే అంచనాలు, సంవత్సరం పాటు వాయిదా, తీరా విడుదల సమయానికి నోట్ల గండం.. ఇలా ఇన్ని సమస్యలను ఎదురొడ్డి పెద్ద సాహసం చేసి సినిమాను విడుదల చేశారు. దానికి ఫలితంగా కొన్ని విషయాల్లో మిశ్రమ స్పందన వచ్చినా మొత్తంగా సినిమా మంచి టాక్ తో రన్ అవుతోంది. ప్రస్తుతం సినిమాకి వస్తున్నా స్పందనపై దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ “సంవత్సరం వాయిదా తర్వాత కూడా ఈ రకమైన స్పందన వస్తుండటం చాలా ఆనందంగా ఉంది. తెలుగు వెర్షన్ లో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా చైతూ ఇన్నాళ్లు ఓపిగ్గా ఉన్నాడు. ఇక సినిమా విషయానికొస్తే.. ప్రేక్షకులు ఇప్పుడు మాట్లాడుకుంటున్న విధంగా మొదటి భాగంలోనే పాటలన్నీ రావడం, ‘వెళ్ళిపోమాకే’ పాటకి ఎంపిక చేసుకున్న సందర్భం ముందుగా ప్లాన్ చేసినవే. అవి కొత్తదనం పంచుతాయని తెలుసు” అన్నారు.
అయితే సినిమా క్లైమాక్స్ మాటల్లో ముగించడం పట్ల కొంతవరకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దానికి బదులుగా “క్లైమాక్స్ సీన్స్ కోసం వేరే రకంగా ప్లాన్ చేశాం. స్క్రిప్ట్ లో కూడా అదే వుంది. కానీ పలు కారణాల వల్ల అలా కుదరక డైలాగ్స్ రూపేణా ఓ కమర్షియల్ ఫీల్ తో ముగించాం” అని చెప్పుకొచ్చారు. చివరిగా ఈ అనుభవంతో ద్విభాషా చిత్రాలకు శెలవు పలుకుతారా అనగా “అన్ని సినిమాలకు ఇలా జరగదు కదా.. అయినా నాకు ఒకే కథను ఇద్దరు హీరోలతో చెప్పడం మంచి కిక్ ఇస్తుందని” సమాధానమిచ్చారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













