ఇప్పటికే పలుమార్లు పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు జూన్ 27న సినిమా రిలీజ్ కి సన్నాహాలు చేసుకుంటున్న మంచు విష్ణు నెత్తిన మరో పిడుగు పడింది. “కన్నప్ప” సినిమాలో కీలకమైన సన్నివేశాలు కలిగిన ఓ హార్డ్ డిస్క్ ఆఫీస్ నుంచి మాయమైంది. దాంతో ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సరిగ్గా నెలరోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఈ కొత్త సమస్య ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాని విషయం. మాములుగా అయితే సినిమా కంటెంట్ కి కచ్చితంగా బ్యాకప్ ఉంటుంది. నాలుగైదు సిస్టమ్స్ తోపాటు కుదిరితే క్లౌడ్ బ్యాకప్ కూడా చేస్తారు. కానీ.. మిస్సయిన హార్డ్ డిస్క్ నుంచి సన్నివేశాలు ఆన్ లైన్లో లీక్ అయితే మాత్రం సినిమాకి కచ్చితంగా పెద్ద మైనస్ అవుతుంది.
సదరు హార్డ్ డిస్క్ లో ఎవరి తాలూకు సన్నివేశాలున్నాయి? ఎంత నిడివి సన్నివేశాలున్నాయి? అనేది గోప్యంగా ఉంచారు. మరి ఆ హార్డ్ డిస్క్ చోరీ చేసిన రఘు ఆ పని ఎందుకు చేశాడు? అతడ్ని ప్రేరేపించిన కారణం ఏమిటి? అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇకపోతే.. మంచు ఫ్యామిలీలో ఆఫీస్ బాయ్ లు లేదా పనోళ్లు చోరీకి పాల్పడడం, ఆ విషయమై వాళ్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇదేమీ కొత్త కాదు. కాకపోతే.. “కన్నప్ప” సినిమా గురించి కావడంతో ఈ విషయానికి ప్రాముఖ్యత ఏర్పడింది. మరి ఈ సమస్యను మంచు విష్ణు ఎలా అధిగమిస్తాడు? సినిమా రిలీజ్ డేట్ మీద ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమైంది.