మహేష్ బాబు అన్నయ్యగా ప్రెజంట్ జనరేషన్ కి, ‘అర్జున్’ సినిమా నిర్మాతగా కొందరు యంగ్ ఫ్యాన్స్ కి పరిచయస్తుడైన రమేష్ బాబు కథానాయకుడిగా దాదాపు 25 సినిమాల్లో నటించాడన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హీరోగా నిలదొక్కుకేలేకపోయానన్న బాధతో ఆయన సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉండి.. అనంతరం నిర్మాతగా మారి మహేష్ తో “అర్జున్” చిత్రాన్ని తెరకెక్కించి యావరేజ్ హిట్ అందుకొన్నారు. అయితే.. రమేష్ బాబు కథానాయకుడిగా తమ్ముడు మహేష్ బాబు క్లాప్ తో మొదలైన భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేసిన ఓ జానపద చిత్రం మధ్యలోనే ఆగిపోయిందనే విషయం ఎంతమందికి తెలుసు?
రమేష్ బాబు , ఇంద్రజ జంటగా 1999 జూన్ 24 న రామానాయుడు స్టూడియోలో జానపద చిత్రం “భూలోక వీరుడు- జగదేక సుందరి” ప్రారంభమైంది. మహేష్ తొలి క్లాప్ ఇచ్చారు. జానపద బ్రహ్మ విఠలాచార్య తనయుడు శ్రీనివాస్ దర్శకుడు. పుస్తకాల అశోక్ , పుస్తకాల రఘు , కలిగొని వేణు, కీర్తి వెంకటేశ్ నిర్మాతలు. రమేష్ కు , ఇంద్రజ కు ఇదే తొలి జానపద చిత్రం. అయితే కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.