మంచు సోదరుల మధ్య ఉన్న మనస్పర్థలు తెలిసిన సంగతే. ఏదో చల్లారింది, అంతా సెట్ అయిపోయింది అనుకునేలోపే, మరో కొత్త వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతూనే ఉంటుంది. నిన్నటికి నిన్న మంచు మనోజ్ (Manchu Manoj) ‘భైరవం’ (Bhairavam) అంటూ సిల్వర్ స్క్రీన్పై రీఎంట్రీ ఇచ్చి సందడి చేస్తుంటే, మరోవైపు అన్నయ్య విష్ణు (Manchu Vishnu) చెన్నైలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతున్నాయి.విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైందని, దాని వెనుక మనోజ్ సన్నిహితుల హస్తం ఉందంటూ విష్ణు సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో ఒక్కసారిగా మంచు ఫ్యామిలీలో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఈ హార్డ్ డిస్క్ మిస్సింగ్పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 90 నిమిషాల అత్యంత కీలకమైన ఫుటేజ్ ఆ హార్డ్ డిస్క్లో ఉందని, అది సినిమాకు ప్రాణమని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రభాస్ కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, అన్నయ్య ఆరోపణలపై మనోజ్ మాత్రం పూర్తి మౌనం పాటిస్తూ, తన పని తాను చేసుకుపోతున్నాడు. మరోవైపు విష్ణు మాత్రం, తమ్ముడిపై ప్రత్యక్ష ఆరోపణలతో ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఇది ఇప్పుడు కేవలం కుటుంబ కలహంగా కాకుండా, న్యాయపోరాటం వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాగైనా ఆ హార్డ్ డిస్క్ను తిరిగి దక్కించుకోవాలని, అందుకోసం మనోజ్పై అన్ని విధాలా ఒత్తిడి పెంచేందుకు విష్ణు వ్యూహరచన చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
నిజానికి ఈ హార్డ్ డిస్క్ కొన్ని నెలల క్రితమే చోరీకి గురైందని, అయితే ముంబైలోని వీఎఫ్ఎక్స్ బృందాన్ని సంప్రదించినప్పుడే ఈ విషయం విష్ణు దృష్టికి వచ్చిందని మరో టాక్ నడుస్తుంది. అప్పటి నుంచి లోలోపల జరుగుతున్న ఈ వ్యవహారం, ఇప్పుడు విష్ణు వ్యాఖ్యలతో బట్టబయలైంది. ఈ మొత్తం గొడవలో, కుటుంబ పెద్ద మోహన్ బాబు (Mohan Babu) మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు. ఆయన మౌనం వెనుక ఆంతర్యమేమిటి అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.