మంచు మనోజ్.. టాలీవుడ్లో ఆల్ రౌండర్ అనే ట్యాగ్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యే యాక్టర్. నటన, యాక్షన్ కొరియోగ్రఫీ, గీత రచయిత, గాయకుడు అంటూ సినిమా పరిశ్రమలో చాలా పనులు చేస్తూ ఉంటారాయన. ఈ మధ్య టాక్ షో హోస్ట్గా కూడా చేశారు. ఇక సినిమాలు నిర్మించడం ఎలాగూ ఉంది. ఇప్పుడు సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ తనకు, కుటుంబ సభ్యులకు ఓ ఎమోషనల్ మైల్ స్టోన్ అని ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు కూడా.
మంచు మనోజ్ జీవితంలో సంగీతం తొలినాళ్ల నుండి ఓ పార్ట్గానే ఉంది. ‘పోటుగాడు’ సినిమాలో ‘ప్యార్ మే పడిపోయానే..’ పాటను పాడి ప్రేక్షకులను మెప్పించారు. కొవిడ్ – లాక్డౌన్ సమయంలో ‘అంతా బాగుంటాంరా’ అనే పాటను విడుదల చేశారు. ‘మిస్టర్ నూకయ్య’ సినిమాలో ‘పిస్తా పిస్తా.. ’, ‘ప్రాణం పోయే బాధ..’ … ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ‘ఎన్నో ఎన్నో..’ పాటలకు సాహిత్యం కూడా అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణితో కలిసి హాలీవుడ్ సినిమా ‘బాస్మతి బ్లూస్’కు సంగీతం అందించారు.

ఆ అనుభవం, ఆసక్తితో ‘మోహన రాగ మ్యూజిక్’ అనే కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయటం, సంగీతాన్ని ప్రోత్సహించటం, భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు నచ్చే సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే లక్ష్యంగా ‘మోహన్ రాగ మ్యూజిక్’ ఏర్పాటు చేస్తున్నారు. అటు మోహన్బాబుకి, ఇటు మనోజ్కి మోహన రాగం అంటే ఇష్టం. అదుకే తన కొత్త ఆలోచనకు ఆ పేరు పెట్టారు. ఇందులో ఒరిజినల్ సింగిల్స్, కొలాబ్రేషన్స్, కొత్తరకం మ్యూజిక్ ప్రాజెక్ట్స్ రానున్నాయి.
ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘భైరవం’, ‘మిరాయ్’ సినిమాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘మనం మనం బరంపురం.. వాట్ ది ఫిష్’ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఇటీవల ‘డేవిడ్ రెడ్డి’ అనే మరో సినిమాను కూడా హీరోగా అనౌన్స్ చేశారు.
