విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్డమ్’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ నెల 31న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్లకు కొత్త ధరలు వచ్చాయి. సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ సినిమా బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. విడుదల రోజు నుంచి 10 రోజుల పాటు ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్స్లో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ల్లో రూ.75 (జీఎస్టీతో కలిపి) టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ప్రీమియర్ షోల విషయంలో ఇంకా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. కానీ సినిమా వర్గాల సమాచారం ప్రకారం అయితే ముందు రోజు అంటే జులై 30న రాత్రి స్పెషల్ ప్రీమియర్లు ఉన్నాయి. హైదరాబాద్లో సెలక్ట్డ్ స్క్రీన్లలో ఈ ప్రీమియర్లు ఉంటాయి అని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఏర్పాటు ఉంటుందని, ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాక వివరాలు వెల్లడించలేదు అని చెబుతున్నారు. ఇంకా తెలంగాణలో సినిమా టికెట్ ధరల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. గత కొన్ని సినిమాలుగా తెలంగాణలో టికెట్ల పెంపు లేదు. ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ సినిమాకు టికెట్ల ధరలు పెంచారు. ప్రీమియర్ షో కూడా ఇచ్చారు. ఆ లెక్కన ‘కింగ్డమ్’ సినిమాకు కూడా టికెట్ల ధరల పెంపు ఉంటుంది అని చెబుతున్నారు.
మరి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ‘హరి హర వీరమల్లు’ సినిమాకు ఇచ్చి.. ‘కింగ్డమ్’ సినిమాకు పెంచకపోతే లేనిపోని చర్చలు వస్తాయి అనే డౌటనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది అనే ఆసక్తి మొదలైంది.