నాటకంగా మారనున్న దీపికా చిత్రం..!
- November 15, 2016 / 10:19 AM ISTByFilmy Focus
ఇప్పుడంటే సినిమా కథలు వేరు, పుస్తకాల కథలు వేరు. కానీ ఒకప్పుడు పుస్తకాలు/ నవలలు లో ఉన్న కథలే సినిమాకి దిక్కు. ఇది తొలినాళ్లలో మాట. తర్వాతి కాలంలోనూ కొన్ని నవలా చిత్రాలు వచ్చి వెండితెరపై విజయబావుటా ఎగురవేశాయి. అయితే సినిమా నాటకంగా మారడం మాత్రం కాస్త చిత్రమైన విషయమే. ఈ చిత్రమే వాస్తవం కానుందిప్పుడు.ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగులీనుతున్న దీపికా పదుకొణె ‘ఓం శాంతి ఓం’ అనే సినిమాతో హిందీ చిత్రసీమలో పాదం మోపింది.
తొలిచిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు పొంది, ప్రేక్షకులను సైతం మెప్పించింది దీపికా. అలా మొదలైన దీపికా ప్రయాణం ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘పీకూ’, ‘బాజీరావు మస్తానీ’ వంటి చిత్రాలతో తారాస్థాయికి చేరుకుంది. అయితే దీపికా తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’ ఇప్పుడు రంగస్థల నాటకంగా ప్రదర్శితం కానుంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, ఈ సినిమా దర్శకురాలు ఫరా ఖాన్ ఈ విషయాన్ని ఇటీవల తెలియజేయగా తాజాగా దీపిక సైతం దీనిని ధృవీకరించింది. ఓ జపనీస్ నాటక సంఘం వారికి ఈ సినిమా నచ్చడంతో వారు దీనిని నాటకంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారట. వచ్చే సంవత్సరం జులైలో జరుగనున్న ఈ ప్రదర్శనకు దీపికా, ఫరా హాజరు కానుండటం విశేషం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















