లండన్ లో పవన్ స్పీచ్!
- July 11, 2016 / 02:30 PM ISTByFilmy Focus
రీసెంట్ గా లండన్ లోని ‘యుక్తా’ ముగింపు వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. సుమారు 1500 మంది పాల్గొన్న ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమ్మలో పవన్ కళ్యాణ్, సాంస్కృతిక ఉత్సవాలు , వాటి ప్రయోజనాల గురించి మాట్లాడుతూ కళ మనకు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేది గా ఉండాలి అని చెప్పారు.
కళ అనేది సంస్కృతి లో అంతర్భాగమని,మన భాష ని, యాసని మర్చిపోకూడదని ఈ సందర్భం గా పేర్కొన్నారు. తన సినిమాల ద్వారా సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, వివిధ తెలుగు ప్రాంతాల జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని జానపదం గురించి ప్రస్తావించి చెప్పారు. తెలుగు సంప్రదాయాల్నిభావితరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయ పడ్డారు. UKTA తలపెట్టిన ఈ మహాద్యమం లో పాల్గొన్న కళాకారుల్ని, విజయవంతం గా నిర్వహించిన కార్యవర్గ సభ్యులని, కళల పట్ల ఆసక్తి తో విచ్చేసిన ప్రేక్షకులను అభినందించారు. తెలుగు సంస్కృతి మరియు కళలను భావి తరాల వారికి అందించటం లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, దీనికి ప్రవాస ఆంధ్రులు చేస్తున్న కృషిని కొనియాడారు.

















