ఆ హీరోకి ఇన్స్టాగ్రామ్లో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ హీరోకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ హీరోయిన్కి ఫాలోయింగ్ భారీగా ఉంది, ఈ హీరోయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ అని నెటిజన్లు లెక్కలేస్తూ ఉంటారు. దాని ఆధారంగానే స్టార్ డమ్ ఇచ్చేసి కొండ మీద ఎక్కించి కూర్చోబెడుతుంటారు. అయితే అదంతా ఓ గాలి బుడగ అని చెప్పినా వినరు. తాజాగా ఈ విషయం మీద ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే (Pooja Hegde) స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ హంబక్ అని.. చూడాల్సిన విషయం వేరు అని తేల్చి చెప్పేసింది.
తెలుగు సినిమా తారలు అనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ సినిమా తారలు, ప్రేక్షకులు సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటారు. సినిమా తారలు అంటే తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి అలా చేస్తుంటారు. ప్రేక్షకులు మాత్రం లేని పోని చర్చల్లోకి వెళ్లి ఫ్యాన్స్ వార్స్లో ఇరుక్కుంటూ ఉంటూరు. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల కౌంట్ సినిమాల వరకు వచ్చేసరికి నటులకు పెద్దగా ఉపయోగపడదు అని కుండబద్ధలు కొట్టేసింది పూజా హెగ్డే.
తనకు ఇన్స్టాగ్రామ్లో మూడు కోట్ల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారని, అయితే వాళ్లంతా సినిమా కోసం థియేటర్లకు రారని తనకు తెలుసు అని తేల్చి చెప్పింది. మరోవైపు కొంతమంది కనీసం 50 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉండరని, కానీ వాళ్ల సినిమాలకు బాగానే జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తారని ఓ ఉదాహరణగా చెప్పుకొచ్చింది. అందుకే సోషల్ మీడియా, సినిమాను వేర్వేరు ప్రపంచాలుగానే చూడాలని సూచించింది. ఒక దాని ప్రభావం ఇంకో రంగం మీద ఉంటుంది అని ఆశించడం సరికాదు అని కూడా చెప్పింది.
ఆమె చెప్పినట్లే అంతమంది ఫాలోవర్లు ఉన్నా గత కొన్నేళ్లుగా ఆమె చేసిన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రాలేదు. కాబట్టి సోషల్ మీడియా నెంబర్లతో ఎక్కువ ఊహించుకుంటే అసలుకే మోసం వస్తుంది. అందరూ ఈ మాట వింటున్నారా? మీ హీరోయినే ఈ మాట చెప్పింది.