‘వార్ 2’ సినిమా గురించి సినిమా ప్రపంచం ఇప్పుడు బాగానే మాట్లాడుకుంటోంది. అయితే ఎక్కడో చిన్న వెలితి అయితే కనిపిస్తోంది. అదే సినిమా ప్రచారం. ఇద్దరు అగ్ర హీరోలు, ఒక స్టార్ హీరోయిన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాను ఇంత పేలవంగా ప్రచారం చేయడమా అనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. అయితే వీటన్నింటికీ బదులు ఇచ్చేందుకు యశ్రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో సినిమా గురించి స్పెషల్ పాయింట్ ఒకటి బయటకు చెప్పింది. ఆ లెక్కన దేశంలో తొలి సినిమాగా వార్ 2 నిలుస్తుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’. ఆగస్టు 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో సినిమాను డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
భారతదేశ చిత్ర నిర్మాణంలో ఇది కొత్త శకానికి నాంది అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. అంతేకాదు విదేశాల్లోనూ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో సినిమాను ప్రదర్శిస్తున్నారట. మరోవైపు ప్రచారంలో సినిమా బృందం కొత్త ఆలోచనలు, వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు తారక్ అభిమానులు కూడా విదేశాల్లో సినిమాను ప్రచారం చేస్తున్నారు. ఫ్లైట్ స్మోక్తో ‘ఎన్టీఆర్’, ‘వార్ 2’ పేర్లను రాసి విదేశాల్లో ప్రచారం చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే ప్రయత్నం బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమా విషయానికొస్తే 2019లో వచ్చిన ‘వార్’ సినిమాకు ఇది కొనసాగింపుగా తెరకెక్కుతోంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ యువ నిర్మాత నాగ వంశీ విడుదల చేస్తున్నారు.