‘కన్నప్ప’ ’ (Kannappa) సినిమాను ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురి కావాల్సి వస్తుంది.. జాగ్రత్త.. అంటూ ప్రముఖ నటుడు రఘుబాబు(Raghu Babu) రీసెంట్గా కామెంట్ చేశారు. ఎందుకు చేశారు అనేది అందరికీ తెలిసే ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో.. ఇండియన్ సినిమాలోని మరికొంత మంది స్టార్లు అతిథి పాత్రల్లో నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా ప్రచారంలో భాగంగా రఘుబాబు ఈ మాటలు అన్నారు.
చాలా నెలలుగా వరుస వాయిదాలు పడుతూ వచ్చిన ‘కన్నప్ప’ సినిమా ఇప్పుడు ఏప్రిల్ 25ని విడుదల తేదీగా ఫిక్స్ చేసుకుంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు సినిమా టీమ్తో కలసి వివిధ శివాలయాలు, ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్నాడు. అలా రీసెంట్గా జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతుండగా.. మైక్ తీసుకున్న రఘుబాబు ఈ శాపం గురించి మాట్లాడారు. అయితే ఆయన కాస్త లేట్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో సినిమా మీద ఉన్నంత నెగిటివిటీ ఇప్పుడు లేదు.
రఘుబాబు అన్నదాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే దేవుడి సినిమా మీద అలా అవాకులు, చెవాకులు మాట్లాడటం సరికాదు. దీనిని ఎవరూ హర్షించరు కూడా. అయితే ఆ అవకాశం టీమ్ ఇవ్వకూడదు. ఇలాంటి దేవుడి నేపథ్యంలో సాగే సినిమాల విషయంలో ఎలాంటి తప్పిదాలు దొర్లకుండా చూసుకోవాలి. అనవసరమైన సన్నివేశాలు, పాటలు ఉండకూడదు. ఇక నాణ్యత విషయంలో కూడా జాగ్రత్త పడాలి. లేదంటే ట్రోలింగ్ జరుగుతుంది.
దీనికి మనకు తాజా ఉదాహరణ ‘ఆదిపురుష్’ (Adipurush). రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పాత్రలు చూపించిన విధానం, తెరకెక్కించిన విధానంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అప్పుడు కూడా టీమ్ ‘రాముడి సినిమాను ట్రోల్ చేస్తే మంచి కాదు. శ్రీరాముడి ఆగ్రహానికి గురవుతారు. శాపం పెడతారు’ అని అనలేదు కదా. ఆ సినిమా అనే కాదు ‘శ్రీ మంజునాథ’ విషయంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి. అంతకుమందు ‘పాండురంగ మహత్మ్యం’, ‘అన్నమయ్య’ (Annamayya) సినిమాల విషయంలోనూ విమర్శలు వచ్చాయి.