Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడు ఈసారి కడపలో జరగనుంది. మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా పార్టీ అగ్రనేతలు, లక్షలాది మంది కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈసారి మహానాడు కడప జిల్లాలోని సీకే దిన్నెలో జరగనుంది, రాయలసీమ అభివృద్ధి, సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించనున్నారు.

Jr NTR

ఈసారి మహానాడు విశేషంగా నిలవనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుత విజయం సాధించడం, చంద్రబాబు నాయుడు 75వ ఏట అడుగుపెట్టడం వంటి అంశాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తెచ్చాయి. అంతేకాక, ఈసారి మహానాడులో నందమూరి కుటుంబ సభ్యులను ఆహ్వానించి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని పార్టీ ఆలోచిస్తోంది. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) , కళ్యాణ్ రామ్‌లను (Nandamuri Kalyan Ram) ఈ వేదికపై చూడాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల నందమూరి కుటుంబ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం గమనార్హం. బాలకృష్ణకు (Nandamuri Balakrishna) పద్మభూషణ్ అవార్డు రాగానే ఆయన మొదటి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, లండన్‌లో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie)  కాన్సర్ట్‌లో బాలకృష్ణను ఆప్యాయంగా ప్రస్తావించారు. మరోవైపు, కళ్యాణ్ రామ్ గుంటూరులో తన సినిమా ప్రమోషన్ సందర్భంగా టీడీపీ జెండాను పట్టుకుని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ నేపథ్యంలో, నారా-నందమూరి కుటుంబాలు ఒక్కటవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పార్టీ అధినాయకత్వం ఈసారి మహానాడును చరిత్రాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. నందమూరి కుటుంబ సభ్యుల రాకతో “అంతా ఒక్కటే” అనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని చూస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎన్టీఆర్, టీడీపీ వైపు మొగ్గు చూపితే, పార్టీకి కొత్త ఊపు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

అయితే, జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు హాజరవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. నారా లోకేష్ ఇప్పటికే టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా స్థిరపడ్డాడు, ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించాడు. ఈ పరిస్థితుల్లో, ఎన్టీఆర్ రాక రాజకీయంగా కాకపోయినా, కుటుంబ సమైక్యత సందేశాన్ని ఇవ్వడానికి ఉపయోగపడవచ్చు. మహానాడు వేదికపై నందమూరి సోదరులు కనిపిస్తే, టీడీపీకి కొత్త బలం చేకూరుతుందని అంతా ఆశిస్తున్నారు.

హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus