పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికై దాదాపు ఏడాది కావస్తున్నా.. ఇప్పటివరకు ఇండస్ట్రీ నుండి ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదనే విషయాన్ని హైలైట్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయమై అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజులు (Dil Raju) స్పందించి త్వరలోనే కలుస్తామని వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.
అయితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలో ఇండస్ట్రీ పెద్దలందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ ఆదివారం (జూన్ 15) కలవనున్నారని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం, 4.00 గంటలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు దాదాపు 30 మంది విజయవాడలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.అయితే.. ఈ మీటింగ్ విషయంలో ఇటీవల ఆర్.నారాయణమూర్తి కాస్త ఘాటుగా స్పందించారు, మరి ఆయన కూడా ఈ మీటింగ్ లో భాగస్వామి అవుతారా అనేది చూడాలి.
ఇకపోతే.. గతంలో ఇండస్ట్రీ పెద్దలు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు, జగన్ & టీమ్ ఇండస్ట్రీ వ్యక్తులను రిసీవ్ చేసుకున్న తీరు, ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi) వేడుకోలును జగన్ పట్టించుకోకుండా వదిలేసిన తీరు ఎన్నో సమస్యలకు దారి తీసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో జగన్ ను ఏకిపారేశాడు, ఇదా మీ సంస్కారం అంటూ చెలరేగిపోయాడు.
మరి ఈసారి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దగ్గరుండి మరీ ఈ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు కాబట్టి అలాంటివేమీ జరగకుండా ఉంటుందనే అనుకుందాం.అయితే.. ఈ మీటింగ్ కేవలం మర్యాదపూర్వకంగా కలవడానికే పరిమితమా? లేక ఇండస్ట్రీ బాగోగులు మరియు థియేటర్ల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందా అనేది మాత్రం ఇక్కడినుంచి వెళ్లే 30 మంది ఇండస్ట్రీ పెద్దల చేతుల్లోనే ఉంది. మరి ఆ 30 మంది ఎవరు? అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.