“అల వైకుంఠపురములో” అనంతరం త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సినిమా ఏంటా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్న అంశం. మధ్యలో పవన్ కళ్యాణ్ కోసం కొన్ని సినిమాలకు మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేసినప్పటికీ.. అతని డైరెక్ట్ సినిమా మాత్రం రాలేదు. అయితే.. “మ్యాడ్ స్క్వేర్” ప్రమోషన్స్ సమయంలో నిర్మాత నాగవంశీ చాలా ఎగ్జైట్మెంట్ తో బన్నీ (Allu Arjun) తో త్రివిక్రమ్ సినిమా ఉండబోతోందని, కుమార స్వామి జీవితం ఆధారంగా తెరకెక్కే ఆ మైథలాజికల్ మూవీని ఎవ్వరూ అంచనా వేయలేరని భీభత్సమైన హైప్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ బన్నీ చేజారి ఎన్టీఆర్ వద్దకి వెళ్లిందని స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది.
నిజానికి బన్నీకి హిందీ మార్కెట్ లో భీభత్సమైన క్రేజ్ తీసుకొచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” అనంతరం “పుష్ప” నార్త్ మాస్ ఆడియన్స్ కు బన్నీని మరింత దగ్గర చేసింది. అయితే.. త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ నో చెప్పాడా లేక, బన్నీ ఆల్రెడీ నటిస్తున్న అట్లీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియక త్రివిక్రమ్ ను వేరే హీరోను చూసుకోమని చెప్పాడా అనేది తెలియదు కానీ.. చాలా భారీ ప్రాజెక్ట్ గా చెప్పబడే ఈ మైథలాజికల్ సినిమాను వదులుకోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
అయితే.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా అనౌన్స్ చేసి తర్వాత దాన్ని పక్కనపెట్టేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఎనౌన్స్ చేయబోయే సినిమా ఎప్పడు మొదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ “డ్రాగన్” సినిమాకి వర్క్ చేస్తున్నాడు, అనంతరం “దేవర 2” ఉంటుంది.
ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందేమో, అంటే ఇంచుమించుగా మూడేళ్ళు పట్టేస్తుంది. ఈలోపు త్రివిక్రమ్ కూడా రామ్ చరణ్, వెంకటేష్ లతో సినిమాలు చేస్తారని వినికిడి. చూద్దాం ఏమవుతుందో!