థియేటర్లలో కుర్రకారు కేరింతలు, ఈలలు, డ్యాన్స్లు చూసుంటారు. మన దగ్గర స్టార్ హీరో సినిమా వచ్చిన ప్రతిసారి తొలి రోజు.. ఆ సినిమా విజయం సాధిస్తే ఆడినన్ని రోజులు ఇలాంటివి చూస్తుంటాం. అయితే కుమిలి కుమిలి ఏడ్చే సీన్స్ ఎప్పుడైనా చూశారా? ఎప్పుడో ‘మాతృదేవోభవ’ సినిమా సమయంలో మన దగ్గర చూసుంటాం. అయితే పూర్తి మదర్ సెంటిమెంట్. కానీ ఓ ప్రేమకథతో ఇలాంటి పరిస్థితి తెచ్చారు ‘సైయారా’ కపుల్. దాంతో ఆ సినిమా హీరోయిన్ అనీత్ పడ్డాను అందరూ అందాల రాక్షసి అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.
ఆ అందాల రాక్షసి ఇప్పుడు దెయ్యంగా మారబోతోంది. ఇది పుకారు కాదు.. నిజం. ఆ సినిమా టీమ్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. నేషనల్ క్రష్ రష్మిక మందనను దెయ్యంగా మార్చిన మడాక్ ఫిల్మ్ ఇప్పుడు అనీత్ పడ్డాను దెయ్యంగా మార్చబోతోంది. ఈ మేరకు ‘థామా’ సినిమా క్లైమాక్స్లో సినిమాను అనౌన్స్ చేసేసింది. ‘శక్తి శాలిని’ పేరుతో తెరకెక్కనున్న కొత్త సినిమాలో అనీత్ హీరోయిన్గా నటిస్తుందని తెలిపింది. హారర్ కామెడీ యూనివర్శ్లో భాగంగా ఈ సినిమా కూడా వస్తుంది.
‘సైయారా’ సినిమాలో చాలా కూల్ జెన్జీ గర్ల్లా కనిపించిన అనీత్ పడ్డా ఇప్పుడు దయ్యం పాత్రలో కామెడీ చేయడం అంటే పూర్తిగా లుక్ అండ్ యాక్టింగ్ రివర్స్ అయిపోతుంది అని చెప్పాలి. అందుకే ఆమె నుండి ఇప్పటికిప్పుడు ఇలాంటి పాత్రను ఎవరూ ఊహించి ఉండరు. ఇక ఈ పాత్రను తొలుత కియారా అడ్వాణీకి ఇచ్చింది మడాక్ ఫిల్మ్స్. అయితే ఆమె రీసెంట్గా తల్లి కావడంతో సినిమా నుండి తప్పుకుంది అని సమాచారం. ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా వచ్చే ఏడాది డిసెంబరు 24న విడుదల చేస్తామని టీమ్ ప్రకటించేసింది.