ఒక సినిమా దేశం మొత్తం రీమేక్ అవుతోంది.. చేసిన ప్రతి చోటా విజయం సాధిస్తోంది అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ‘దృశ్యం’ సిరీస్లో వస్తున్న సినిమాల గురించే చెబుతున్నాం. మలయాళంలో తొలుత రూపొందిన ఈ సినిమా.. ఆ తర్వాత కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ.. వరుసగా రీమేక్లు అవుతూ వచ్చింది. ఈ సిరీస్లో వచ్చిన రెండు సినిమాలూ ఇలానే జరిగాయి. అయితే మూడో సినిమా విషయానికొచ్చేసరికి ఓ చిన్న ఇబ్బంది వచ్చింది. అదే ఒకేసారి రిలీజా? లేక రీమేకా? అని. అయితే ఈ విషయంలో క్లారిటీ వచ్చింది..
మోహన్లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘దృశ్యం 3’కి సంబంధించి ఇప్పుడు చిక్కుముడి విడిపోయింది. రిలీజ్ డేట్ విషయంలో మలయాళ సినిమా టీమ్ పట్టిన పట్టుకు హిందీ సినిమా టీమ్ డేట్ను మార్చుకోవాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు తెలుగు సినిమా టీమ్ కూడా బాలీవుడ్ దారిలోకి వచ్చింది. ఈ మేరకు సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారు. మలయాళంలో సినిమా రిలీజ్ అయిన తర్వాతే హిందీ, తెలుగులో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు తెలుగు ‘దృశ్యం 3’ నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు ప్రకటించేశారు.
ఈ లెక్కన అక్టోబర్ 2న మూడో ‘దృశ్యం’ రిలీజ్ చేయడానికి సురేశ్ బాబు కూడా ప్లాన్ చేస్తున్నారు. మలయాళ వెర్షన్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్లో విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఈ పనులు పూర్తవ్వగానే జీతూ జోసెఫ్ టాలీవుడ్ వచ్చి.. వెంకటేష్తో తెలుగు ‘దృశ్యం 3’ తెరకెక్కిస్తారట. సురేశ్ బాబు మాటల్లో ‘అన్నీ అనుకున్నట్లుగా జరిగితే’ అప్పుడే రిలీజ్ అన్నారు కానీ హిందీలో వచ్చాక కూడా లేట్ చేస్తారని అనుకోవడం లేదు. కాబట్టి అక్టోబరు నాటికి రెడీ చేస్తారన్నమాట. ఈలోపు వెంకీ – త్రివిక్రమ్ సినిమా ‘ఏకే 47’ షూటింగ్ను పూర్తి చేస్తారట. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.