సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలు ఏంటి అని ఓ లిస్ట్ రాస్తే.. పైరసీ మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే వందల మంది కష్టపడి, పదుల కోట్లు.. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. అయితే ఆ సమస్యతోపాటు మరో సమస్య కూడా ఉంది. అయితే ఇన్నాళ్లూ ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ (Film Chamber) అంతగా పట్టించుకోలేదు అనే చెప్పాలి. అయితే ఏమైందో ఏమో కానీ శనివారం ఓ మీటింగ్ పెట్టి ఈ విషయంలో గట్టి రియాక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసింది.
దీంతో ఇన్నాళ్లకు రియాక్ట్ అయ్యారా అనే కామెంట్ వినిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలోని ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్, క్రిటిక్స్ సంఘం, డిజిటల్ కంటెంట్ రైటర్ల అసోసియేషన్లతో ఫిల్మ్ ఛాంబర్ సమావేశం నిర్వహించింది. యూట్యూబ్లో తప్పుడు థంబ్నైల్స్ విషయంలో చర్చలు జరిపింది. దాంతోపాటు పరిశ్రమలో ఇటీవల జరిగిన పరిణామాలపై కూడా అసోసియేషన్ సభ్యులతో చర్చించిందని సమాచారం. నటీనటుల విషయంలో అసభ్యకరమైన ప్రశ్నలు, అనుచిత వ్యాఖ్యలతో థంబ్నైల్స్ విషయంలో ఫిల్మ్ ఛాంబర్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
సినిమా ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేలా కొంతమంది డిజిటల్ కంటెంట్ పీపుల్ వ్యవహారిస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదని అసోసియేషన్ల సభ్యులతో చెప్పినట్లు సమాచారం అలాంటి వారిపై ఏప్రిల్ 1 నుండి చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్ ఆలోచిస్తోందని వారి దృష్టికి తీసుకొచ్చారట. అయితే ఆ మీటింగ్లో ఇంకా ఏం జరిగింది, ఏం మాట్లాడారు అనేది తెలియాల్సి ఉంది. ఏదైతే ఏముంది ఇప్పటికైనా ఫిలిం ఛాంబర్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసింది.