మొన్నటివరకు రివ్యూ రైటర్లకు ఏం అర్హత ఉంది అంటూ తమ సినిమాలకి నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పుడల్లా ఫిలిం మేకర్స్ చెప్పే రొడ్డకొట్టుడు డైలాగ్. ఇప్పుడు ఆ “అర్హత” అనేది ప్రేక్షకులకు కూడా వర్తిస్తుంది అంటూ దర్శకుడు ఫణీంద్ర నార్శెట్టి (Phanindra Narsetti) ఇచ్చినే ఒక స్టేట్మెంట్ చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫణీంద్ర (Phanindra) “బ్యాక్ స్పేస్, మధురం” అనే షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు సంపాదించుకొని “మను”తో దర్శకుడిగా మారాడు.
ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది.ఫణీంద్ర (Phanindra) తాజా చిత్రం “8 వసంతాలు” ఈ నెల 20వ తారీఖున విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ గా విడుదల చేసిన రెండు టీజర్లు, పాటలు ఓ మోస్తరుగా మాత్రమే అలరించాయి. అయితే.. ఫణీంద్ర చేసిన “అర్హత” అనే కామెంట్ మాత్రం భీభత్సంగా వైరల్ అయ్యింది సోషల్ మీడియాలో. ఇవాళ చాలామంది “థగ్ లైఫ్” (Thug Life) చూసి మణిరత్నంకి సినిమా ఎలా తీయాలో చెబుతున్నారు, వాళ్లకి ఏం అర్హత ఉంది అంటూ ప్రశ్నించాడు ఫణీంద్ర.
నిజానికి ఫణీంద్ర అన్నదాంట్లో తప్పు లేదు కానీ.. దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్ గా మణిరత్నం (Mani Ratnam) ని 40 ఏళ్లుగా చూస్తున్నవాళ్లు మాత్రమే క్రిటిసైజ్ చేయాలి కానీ.. ఇప్పటితరం కాదు” అని చెప్పడం అసలు రచ్చకి దారితీసింది. ప్రేక్షకుడి వయసు ఏమిటి, అర్హత ఏమిటి, వాళ్లకున్న పరిజ్ఞానంఏమిటి వంటి విషయాలను పక్కన పెడితే.. 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కామెంట్ చేసే అధికారం ఉంటుంది.
ఈ విషయంలో మాత్రం ఆ మాట అనకుండా ఉండాల్సిందే. అదే ఇంటర్వ్యూలో తెలుగు సినిమా దర్శకులందరూ మూసలో పడిపోతున్నారు అని ఫణీంద్ర చెప్పిన మాట అక్షరాల నిజం, ఇప్పుడు చిత్రసీమలో భిన్నమైన దర్శకులు లేరు, అందరూ మాస్ సినిమా తీసేవాళ్లే.. సాంఘికాలు లేవు, పౌరాణికాలు లేవు. అందుకే భిన్నమైన ఆలోచనాధోరణి ఉన్న దర్శకుడు ఇండస్ట్రీకి అవసరం అని ఫణీంద్ర చెప్పిన మంచి మాట మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.