రామ్చరణ్, సుకుమార్ చిత్రం ప్రారంభం
- January 30, 2017 / 10:22 AM ISTByFilmy Focus
`ధృవ` వంటి సూపర్డూపర్హిట్ మూవీ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాతలుగా కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభమైన ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు కొరటాల శివ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం) మాట్లాడుతూ – “మా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా చేయడం, ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. సమంత హీరోయిన్గా నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్గారు డిఫరెంట్ కాన్సెప్ట్తో రామ్చరణ్ను సరికొత్త లుక్లో ప్రెజంట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమాను అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించనున్నాం. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం, నవీన్నూలి ఎడిటింగ్ వర్క్ను అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















