‘సితారే జమీన్ పర్’ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా హీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ఓటీటీకి తాను వ్యతిరేకంగా అనేలా మాట్లాడాడు. ఓటీటీలకు ఇచ్చేది లేదు అని కూడా అన్నాడు. ఆయన మాటలు అప్పుడు వింటుంటే ఈ సినిమా ఓటీటీ డీల్ ఎలా జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సినిమా టీమ్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సినిమాను ఓటీటీకి ఇవ్వకుండా నేరుగా యూట్యూబ్లోకి తీసుకొచ్చింది. అయితే ఉచితంగా కాకుండా డబ్బులు వసూలు చేయనున్నారు.
ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. ఆ సమయంలోనే తన చిత్రాన్ని ఏ ఓటీటీ సంస్థకూ విక్రయించనని, థియేటర్ల్లలో ప్రదర్శన తర్వాత నేరుగా యూట్యూబ్లో రిలీజ్ చేస్తానని గతంలో చెప్పినట్లుగానే ఇప్పుడు సినిమాను స్ట్రయిట్ ఓటీటీ రిలీజ్కి ఇచ్చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించిన మరీ విడుదల తేదీ తదితర వివరాలు ప్రకటించారు. ఆగస్టు 1 నుండి తమ సినిమాను అద్దె ప్రాతిపదికన యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందని తెలిపాడు. సినిమాను మన దేశంలో రూ.100 చెల్లించి చూడొచ్చని ప్రకటించాడు.
అలాగే ఈ సినిమా విదేశాల్లో కూడా యూట్యూబ్లోనే స్ట్రీమింగ్ అవుతుందని, అయితే ఆ ప్రాంతాన్ని బట్టి సినిమా రెంట్ ధర మారుతుందని చెప్పుకొచ్చారు. హిందీతోపాటు ఆదరణ ఎక్కువున్న అన్ని భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానుందని టీమ్ చెప్పింది. అలాగే సినిమాను యూట్యూబ్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఆమిర్ వివరంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మ్యాగ్జిమమ్ మొబైల్స్లో యూట్యూబ్ ఉంటుందని, దాని ద్వారా సినిమా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశముందని, మరోవైపు ప్రేక్షకుడికి సినిమాను అందుబాటులో ధరలో చూపించాలనేది తన కల అని ఆమిర్ తెలిపాడు. ఇప్పుడు అనుకున్నట్లుగా యూట్యూబ్కే ఇచ్చేశాడు.