రెండేళ్ల క్రితం వచ్చిన ఓ సినిమా ఎఫెక్ట్ కారణంగా అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సినిమాల ఎంపిక విషయంలో చాలా మారిపోయాడు. వచ్చిన కథను, మాస్ కథను ఎంచుకోవడం లాంటి స్టీరియో టైప్ మాస్ హీరోల ఆలోచన నుండి దూరంగా వచ్చేశాడు. అందుకే కొత్త సినిమా ఇదిగో, అదిగో అని పుకార్లు వచ్చినా ఏదీ ఓకే కాలేదు. అలా వరుస ఆలోచనల తర్వాత ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమా దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరుతో ఓ సినిమా ఫైనల్ చేశాడు.
ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో రూపొందిన సెట్స్లో జరుగుతోంది అని సమాచారం. ఇక్కడ సమాచారం అని ఎందుకన్నాం అంటే.. సినిమా టీమ్ ఇంకా ఆ సినిమా గురించి అఫీషియల్గా సమాచారం ఇవ్వలేదు కాబట్టి. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఆ సినిమా సంగతి పక్కనపెడితే యూవీ క్రియేషన్స్లో కొత్త దర్శకుడు అనిల్తో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట.
ఈ రెండు సినిమాలు కాకుండా అఖిల్ మరో కొత్త ప్రాజెక్ట్కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ‘సామజవరగమన’(Samajavaragamana) సినిమాకు సహ రచయితగా చేసిన నందు చెప్పిన కథకు అఖిల్ ఓకే చెప్పాడని సమాచారం. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కున్న ఈ సినిమా.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏడాది ఆఖరులో షూటింగ్ ప్రారంభిస్తారట. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.
ఇక అఖిల్ జన్మదినమైన ఏప్రిల్ 8న ఈ మూడు సినిమాలకు సంబంధించి సర్ప్రైజ్లు వస్తాయని తెలుస్తోంది. హీరోగా పుట్టిన రోజు సందర్భంగా అప్పటికి సెట్స్ మీద ఉన్న సినిమాల పోస్టర్లు వస్తాయి. అలాగే చర్చల్లో ఉన్న, దాదాపు ఓకే అయిన సినిమాల పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తుంటారు. ఆ లెక్కన ఏప్రిల్ 8న అఖిల్ నుండి ట్రిపుల్ ధమాకా పక్కా అని చెప్పొచ్చు.