తెలుగు సినిమా అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, ఆ తర్వాత లవ్ స్టోరీలు, కామెడీ ఎంటర్టైనర్లు రాజ్యమేలేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. మన హీరోలంతా ఇప్పుడు సిటీలను, విదేశీ లొకేషన్లను వదిలేసి దట్టమైన అడవుల బాట పడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురవాలంటే పచ్చని అడవి బ్యాక్ డ్రాప్ ఉండాల్సిందే అని బలంగా ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టులన్నీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం జక్కన్న, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘వారణాసి’ అని చెప్పొచ్చు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ అడ్వెంచర్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. రాజమౌళి లాంటి దర్శకుడు అడవిని ఎంచుకున్నారంటే, అందులో విజయం తాలూకు సీక్రెట్ ఏదో ఉందని మిగతా మేకర్స్ గ్రహించారు. అందుకే ఇప్పుడు అందరి చూపు అరణ్యం వైపే మళ్లింది.
అసలు ఈ అడవి సెంటిమెంట్ ఇప్పుడు పుట్టింది కాదు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము దులిపిన సినిమాలన్నీ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినవే. ఎర్రచందనం అడవుల్లో సాగిన ‘పుష్ప’ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’లో కొమురం భీమ్ ఎపిసోడ్స్, కన్నడ సెన్సేషన్ ‘కాంతార’ అన్నీ అడవిలో జరిగిన కథలే. ఆ నేచురల్ లొకేషన్స్, ఆ రా అండ్ రస్టిక్ ఫీల్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. అందుకే ఇది ఇప్పుడు ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది.
ఈ ఫార్ములాను ఫాలో అవుతూ ఇప్పుడు యంగ్ హీరోలు క్యూ కట్టారు. నాగ చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ ఓ మిస్టికల్ థ్రిల్లర్. ఇది గుహలు, అడవుల చుట్టూ తిరుగుతుందట. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ చేస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో కూడా అడవి నేపథ్యం కీలకంగా ఉండబోతోందని టాక్. వీళ్లే కాదు, పెద్ద హీరోలు కూడా ఇదే రూట్ లో వెళ్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ వర్మ కాంబోలో రాబోయే సినిమాలో కీలక సన్నివేశాలు కర్ణాటక అడవుల్లో ప్లాన్ చేస్తున్నారట. ఇక శర్వానంద్ సంపత్ నంది కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతోందని సమాచారం. ఇలా స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ అడవి తల్లి ఒడిలోనే హిట్ వెతుక్కుంటున్నారు.
