మొన్నీమధ్య #SSRMB / #SSMB29 సినిమా అర్ధరాత్రి ఎక్స్లో వరుస మెసేజ్లు, రిప్లైలు ఇచ్చుకున్న విషయం గుర్తుందా? తమ సినిమా ప్రచారాన్ని అలా అఫీషియల్ లీకులు చేసుకుంటూ ఓ ప్రహసనం చేశారు. దాని వల్ల కొత్తగా వచ్చే బెనిఫిట్ ఏమీ లేకపోయినా టీమ్ మాత్రం ఆ పోస్ట్లు వేసింది / వేయించింది. ఆ విషయం పక్కనపెడితే అందులో దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి హీరో మహేష్ బాబు ఓ కామెంట్ చేశారు. ‘మీకు విలన్స్ అంటేనే ఎక్కువ ఇష్టం’ అని. ఆ మాట ఇప్పుడు నిజమైంది అని చెప్పొచ్చు.
మహేష్ బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా మొదలైనట్లు ఎక్కడా అధికారిక సమాచారం లేదు. మొన్నీమధ్య జరిగిన మిడ్ నైట్ పోస్టులే ఈ సినిమా స్టార్ట్ అయ్యిందని అఫీషియల్గా చెప్పడం. ఈ సినిమా టైటిల్, కాన్సెప్ట్, నటీనటులు, సాంకేతిక నిపుణుల అనౌన్స్మెంట్ కార్యక్రమం ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగబోతోంది. అయితే అంతకుముందే సినిమా నుండి ఓ అప్డేట్ రాబోతోంది.

#GlobeTrotter హ్యాష్ట్యాగ్తో ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందులో హీరో పాత్రకు పోటాపోటీగా విలన్ పాత్రను ఎప్పటిలా రాసుకున్నారు జక్కన్న. ఈ క్రమంలో ఆయన లుక్ను ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు. అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస యాత్రికుడి జీవితం ఈ సినిమా అని చెప్పొచ్చు. ఆ లెక్కన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర అడవి బిడ్డను పోలి ఉంటుంది అని చెబుతున్నారు. అదేంటో మరికాసేపట్లో తెలిసిపోతుంది.

ఇప్పుడు చెప్పండి మహేష్బాబు చెప్పింది నిజమే కదా. హీరో కంటే విలన్ ఫస్ట్ లుక్నే ముందు రిలీజ్ చేస్తున్నారు మరి. చూద్దాం ఇలా ఈ లుక్ ముందు విడుదల కావడం వెనుక రాజమౌళి అండ్ కో. ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది. హీరో లుక్కు ఎలివేషన్ ఇచ్చేలా ఈ లుక్ ఉండోబోతుందేమో చూడాలి.

