మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్బాబు (Mahesh Babu )ఫ్యాన్స్ అయితే SSMB29 అంటున్నారు. రాజమౌళి (S. S. Rajamouli) ఫ్యాన్స్ అయితే SSRMB అంటున్నారు. ఇలా ఏ పేరు పెట్టుకున్నా ఓ సినిమా అయితే రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త, పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారని, దాని వ్యయం సుమారు రూ. 50 కోట్లు అని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఓ చిన్న డౌట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రధానాంశం ప్రపంచాన్ని చుట్టొచ్చే ఓ సాహసికుని జీవితం ఈ సినిమా అని అన్నారు. ఆ తర్వాతేమో అమెజాన్ అడవుల నేపథ్యంలో సినిమా అని చెప్పారు. ఇప్పుడు పెట్టిన బడ్జెట్ వస్తున్న వివరాల ప్రకారం చూస్తే వారణాసి నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది.
ఎందుకంటే రూ.50 కోట్లతో కాశీ సెట్ రూపొందిస్తోంది చిత్రబృందం. మొన్న మార్చిలో ఈ సెట్ ఫొటో ఒకటి లీక్ అయింది. రీసెంట్గా అక్కడే షూటింగ్ చేశారని టాక్. దీంతో సినిమాలో ఓ భాగం అయ్యే వారణాసి సీన్స్ కోసం అంత ఖర్చు పెట్టి సెట్ వేస్తే.. ప్రపంచాన్ని చుట్టొచ్చే యాత్రికుడి పాత్ర కోసం ఇలాంటి సెట్లు ఇంకెన్ని వేయాలి, దానికెంత ఖర్చు అనేది తెలియడం లేదు. ఒకవేళ ఇలా ప్రపంచంలోని అన్ని ముఖ్య ప్రదేశాల సెట్స్ వేసుకుంటూ వెళ్తే ఖర్చు తడిసి మోపెడు అవ్వడం ఖాయం.
ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడు సినిమా టికెట్ రేట్లు ఏ రెండు వేలుకో, మూడు వేలుకో వెళ్లడం ఖాయం. కాబట్టి ఇక్కడ బడ్జెట్ పెరగడం ప్రేక్షకుల జేబుకు చిల్లుకు కారణం అవ్వొచ్చు అనిపిస్తోంది. సినిమాకు గ్రాండియర్ అవసరమే. అయితే మరీ రూ.50 కోట్లు ఖర్చు పెట్టి ఎవరూ ఇంతవరకు ఇండియన్ సినిమాలో సెట్ వేయలేదు. ఇదే తొలి భారతీయ సినిమా. అయితే ఇంత అవసరం ఉందా? అసలు ఈ రూ.50 కోట్లు మేటర్ నిజమేనా? ఏమో రాజమౌళినే (S. S. Rajamouli) చెప్పాలి.