Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?
- June 20, 2026 / 03:33 PM ISTByFilmy Focus Desk
‘పుష్ప: ది రూల్’ సినిమాను అల్లు అర్జున్ ఎప్పటికీ మరచిపోడు. ఆయన ఫ్యాన్స్ కూడా మరచిపోరు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ రోజు ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. ఇంకొకటి భారీ విజయం దక్కింది. అయితే ఆ విజయాన్ని బన్నీ అండ్ కోలో ఎవరూ విజయాన్ని ఆస్వాదించలేకపోయారు. ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఓ తల్లీ కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. తల్లి మృతి చెందగా, బిడ్డ ప్రాణాలతో తీవ్రంగా పోరాడి బయటపడ్డాడు. వారి కుటుంబం కోసం అల్లు అర్జున్ ఆర్థిక సాయం కూడా చేసింది. ఇదంతా అందరికీ తెలిసిందే.
Allu Arjun
అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసు ఇంకా తేలలేదు. అంతేకాదు ఇప్పుడు ఈ కేసు విషయమై బన్నీ కొర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ మేరకు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 22న కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేసిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ను ఏ11 నిందితుడిగా చేర్చారు. దీంతో సోమవారం విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే, ఈ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా, ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భద్రతా కారణాలు, అభిమానుల తాకిడి, తాను నగరంలో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో బన్నీ ఆన్లైన్ హాజరుకు అనుమతి కోరారు. కానీ అల్లు అర్జున్ విన్నపాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన కచ్చితంగా కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది.
మరి విచారణలో ఏం జరుగుతుంది, ఆ రోజు బన్నీ వస్తాడా? లేక వాయిదా కోరతాడా? ఒకవేళ వస్తే విచారణలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. బన్నీ అండ్ ఫ్యాన్స్ అయితే ఈ విషయం త్వరగా తేలాలి అని కోరుకుంటారు.














