బలగం (Balagam) సక్సెస్ తర్వాత వేణు యెల్దండి (Venu Yeldandi) వెంటనే మరో సినిమా పట్టాలెక్కిస్తాడనుకున్నారు. కానీ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం సరైన హీరోని ఎంపిక చేసేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఎల్లమ్మ అనే కథను సిద్ధం చేసుకుని, మొదట నేచురల్ స్టార్ నాని (Nani) దగ్గరకు వెళ్లాడు. కథ నచ్చినప్పటికీ కొన్ని మార్పులు సూచించడంతో, అనేక రీడ్రాఫ్ట్ల తర్వాత కూడా నాని పూర్తి సంతృప్తి చెందకపోవడంతో ఈ ప్రాజెక్ట్ చేతుల దాటింది. ఆపై శర్వానంద్ ( Sharwanand) కూడా ఇదే లైన్లో వెనక్కు తగ్గగా, తేజ సజ్జ (Teja Sajja) కూడా తన కమిట్మెంట్ల కారణంగా వెంటనే ఓకే చెప్పలేకపోయాడు.
ఇలా సాగిన ప్రయత్నాల తర్వాత ఎల్లమ్మ నితిన్ (Nithiin) దగ్గరకు చేరింది. ఇప్పటికే రాబిన్హుడ్ (Robinhood) , తమ్ముడు(Thammudu) సినిమాల్లో బిజీగా ఉన్న నితిన్, ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లైన అజయ్-అతుల్ ద్వయంతో వేణు మ్యూజిక్ సెషన్లలో పాల్గొంటున్నాడట.
ఒక తమిళ, హిందీ సినిమా టచ్తో మ్యూజిక్ను ప్లాన్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం. బలగం సినిమాకే ఎంతటి సంగీత ప్రాధాన్యత ఉందో, ఎల్లమ్మ కోసం ఇంకాస్త హై లెవల్ మ్యూజిక్ కావాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు టాక్. ముంబైలో మ్యూజిక్ కంపోజింగ్ పనులు జరుపుతున్న వేణు, ఈసారి మరింత ఎక్స్పరిమెంట్ చేయబోతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం నితిన్ రాబిన్హుడ్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నప్పటికీ, ఎల్లమ్మ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్గా మారింది. కథ పరంగా కొత్తదనం ఉండటమే కాకుండా, మ్యూజిక్లోనూ ఓ స్పెషల్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో టీమ్ పనిచేస్తోంది. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్ రైటర్గా పని చేయనుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడు. త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ వెలువడనుంది.