‘బాహుబలి’ సినిమాలు రెండింటిని కలిపి ఇప్పుడు బడా ‘బాహుబలి’ సినిమాను సిద్ధం చేసింది చిత్రబృందం. ఈ నెల 31న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ కాదు కాదు రిలీజ్ చేయబోతున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలను ‘బాహుబలి: ది ఎపిక్’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆలోచన ఆర్కా మీడియా టీమ్కే వచ్చిందా? లేక గతంలో ఓ బిజినెస్ మ్యాన్ చేసిన పోస్ట్ (అప్పట్లో ట్వీట్) వల్ల వచ్చిందా అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ.
భారతీయ సినిమాలో ఒక సినిమాను (కథను) రెండు భాగాలుగా చేసి రెండు సినిమాలు చేసిన ట్రెండుకు శ్రీకారం చుట్టిన సినిమా ‘బాహుబలి’ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఒకే భాగంగా తీసుకొస్తుండే సరికి అప్పుడు ఎందుకు రెండు భాగాలు చేశారు అనే ప్రశ్న వస్తోంది అనుకోండి. ఆ విషయం వదిలేస్తే.. ఇప్పుడు ఒక భాగంగా సినిమాను తీసుకొస్తున్న ఆలోచన ఎప్పుడు ఎవరికి వచ్చిందన్నది తెలియాలి. సినిమా ప్రచారంలో రాజమౌళి అండ్ కో చెబుతారేమో చూడాలి.
అయితే ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజైనపుడు లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు ఎక్స్ (అప్పట్లో ట్విటర్)లో 2017 మే 6న ఓ పోస్టు పెట్టారు. ‘‘బాహుబలి’ పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. అలా చేస్తే తక్కువలో తక్కువ రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టవచ్చు. ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని చూపించవచ్చు’’ అని రాజమౌళిని మెన్షన్ చేస్తూ రాశారు.
ఇప్పుడు ఆయన చెప్పిందే జరుగుతోంది. సినిమా ఒకే భాగంగా వస్తోంది. మరి ఆయన ఆలోచనే రాజమౌళి తీసుకున్నారా? లేక వారి ‘బాహుబలి’ సైన్యంలో ఎవరైనా చెప్పారా అనేది ఆర్కా మీడియా, జక్కన జట్టు చెప్పాలి.