Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్.. ఏమవుతోంది?
- April 13, 2026 / 01:26 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ గాయని సత్యవతి ముదావత్ అలియాస్ మంగ్లీ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ‘కేడీ: ది డెవిల్’ సినిమా హిందీ వెర్షన్ పాట విషయంలో విమర్శలు, కేసులు, చర్చలు కారణంగా ఆమె పేరు ఎక్కువగా వినిపించగా.. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో ఆమెపై మోసం ఆరోపణలు వచ్చాయి. రూ.10 కోట్లు మేరకు ఆమె మోసం చేశారని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు ఆమె కూడా ఓ వ్యక్తిపై కేసు పెట్టారు.
Mangli
మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ రూ.10 కోట్ల వరకు మోసం చేశారని.. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. దీంతో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్కు చెందిన ఓ ఈ కేసు పెట్టారు. ఆ డబ్బును గోకులానందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆమె వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారని ఆ న్యాయవాది కంప్లైంట్లో పేర్కొన్నారు.
అంతేకాదు ఈ విషయం గురించి తెలుసుకునేందుకు మంగ్లీని ఇటీవల ఆ న్యాయవాది సంప్రదించారు. ఆ సమయంలో ఆమె తనతో అవమానకరంగా మాట్లాడారని ఆయన అంటున్నారు. కేసు వెనక్కి తీసుకునేందుకు డబ్బులు కూడా ఆఫర్ చేశారని ఆయన చెప్పారు. తాను అంగీకరించకపోవడంతో బెదిరింపులకు కూడా పాల్పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనపై మంగ్లీ ఫిర్యాదు చేశారు. రూ.150 కోట్ల మోసం చేశారంటూ తనపై ఆ న్యాయవాది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మార్చి 21న సుభా పేరుతో ఓ వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుని బెదిరించారని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మంగ్లీ ఫిర్యాదు గత నెలాఖరులో నమోదైంది. న్యాయవాది ఫిర్యాదు ఎప్పుడు జరిగింది అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ ఫిర్యాదులు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.















