ప్రముఖ కథానాయకుడు చిరంజీవిని (Chiranjeevi) ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఇచ్చారు. దీని కోసం ఇటీవల చిరంజీవి లండన్ వెళ్లారు. అయితే ఈ టూర్ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్ మీట్ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి.. డబ్బులు వసూలు చేశారట. ఈ విషయమైన చిరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు.
ప్రియమైన అభిమానులారా. బ్రిటన్లో నా మీద మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. అయితే ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొంతమంది డబ్బులు వసూలు చేశారని తెలిసింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నా. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే, వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి. ఎప్పుడు, ఎక్కడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, లాభార్జనకు దూరంగా ఉంచుదాం అని చిరంజీవి ఆ పోస్టులో పేర్కొన్నారు.
అవార్డు సంగతి చూస్తే.. యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో బుధవారం చిరంజీవిని సత్కరించారు. బ్రిడ్జి ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందజేసింది. సాంస్కృతిక నాయకత్వానికి, చేసిన సేవలకుగానూ ఈ పురస్కారం ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి మాట్లాడుతూ నా అభిమానులు, రక్తదాతలు, సినీ కుటుంబం, స్నేహితులు, కుటుంబ సభ్యులు నా ప్రయాణంలో ఎంతగానో సహకరించారు అని చెప్పారు.
టాలీవుడ్ హీరోలు కొంతమంది విదేశాలకు వెళ్లినప్పుడు గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. ఇటీవల సంక్రాంతి సినిమాల సమయంలోనూ ఓ అగ్రహీరో విషయంలో ఇలాంటిదే జరిగిది అని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. చిరంజీవి అయితే డబ్బులు వెనక్కిచ్చేయమని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మన హీరోలు విదేశాలకు వెళ్లినప్పుడు ఈ ఫ్యాన్మీట్ వసూళ్ల సంగతి చూడాల్సిందే.