గత కొన్ని రోజులుగా ఘాటైన చర్యలు, వ్యాఖ్యలతో మొత్తం ఇండియన్ సినిమా షేక్ ఆడిస్తున్న సందీప్ రెడ్డి వంగాకు (Sandeep Reddy Vanga) అంతకుమించిన ఘాటు, టేస్టు ఉన్న ఓ స్పెషల్ గిఫ్ట్ను పంపించారు ప్రముఖ కథానాయకుడు రామ్ చరణ్ (Ram Charan) భార్య ఉపాసన. ఈ మేరకు సందీప్ వంగా తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పోస్ట్ చేశారు. దాంతోపాటు ఆ గిఫ్ట్కి తన రివ్యూను కూడా ఇచ్చారు సందీప్. ఆయన సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఇప్పటికే ఆ గిఫ్ట్ ‘అత్తమ్మాస్ కిచెన్’ స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అని తెలిసిపోయి ఉంటుంది.
‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) , ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ (Animal) అంటూ వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సందీప్ రెడ్డి వంగా. సినిమాలతో ముంబయిలో మన ఫుడ్ మిస్ అయ్యారు అని అనుకున్నారేమో.. తమ అత్తమ్మాస్ కిచెన్ నుంచి స్పెషల్ మామిడి ఆవకాయ్ పంపించారు. దాంతోపాటు ఆ కిచెన్ ఇన్స్టంట్ ప్రొడక్ట్స్ ఉన్న గిఫ్ట్ బాక్స్ను కూడా పంపించారు. ఆ ఫొటోలనే సందీప్ వంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతోపాటు పికెల్ రుచి అద్భుతంగా ఉంది అని రివ్యూ కూడా ఇచ్చేశారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్తో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్, కాస్టింగ్ వర్క్ జరుగుతోంది. తొలుత అనుకున్న దీపక పడుకొణెను (Deepika Padukone) కాదని, త్రిప్తి డిమ్రిని (Tripti Dimri) కథానాయికగా ఎంపిక చేసి వార్తల్లో నిలిచారాయన. దీంతో పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. ఈ సమయంలో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు సందీప్ రెడ్డి వంగాకు సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపడం గమనార్హం.
ఇక అత్తమ్మాస్ కిచెన్ గురించి చూస్తే.. చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ, ఉపాసన కలిసి ఈ సంస్థ ద్వారా ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్కి వీరాభిమాని అయిన సందీప్ రెడ్డి వంగా చరణ్తో తన స్టైల్ సినిమా ఒకటి చేస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో అనుకుంటున్నారు. మరి ఎప్పటికి అవుతుందో చూడాలి.