గత వారం ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ అనే వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయ్యింది. జూన్ 27 నుండి ఈ సినిమా వెబ్ సిరీస్ ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇది వాళ్ళ ఒరిజినల్ సిరీస్ గా రూపొందినట్లు కూడా వెల్లడించారు. ఆ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో.. కచ్చితంగా ఈ సిరీస్ చూసి తీరాల్సిందే అనే ఆసక్తిని జనాల్లో రేకెత్తించినట్టు అయ్యింది. అయితే ఇంతలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ‘ఈటీవీ విన్’ ఓటీటీ సంస్థ.
వాళ్ళు నిర్మిస్తున్న ‘కానిస్టేబుల్ కనకం’ (Constable Kanakam) అనే వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ను..కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ (Viraatapalem: PC Meena Reporting) గా తీశారు అంటూ వాళ్ళు ఓ ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ కి సంబంధించి ఎటువంటి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యింది లేదు.
అయితే ఈరోజు నిర్వహించిన కాంట్రోవర్సియల్ ప్రెస్ మీట్లో మీడియా వారికి చిన్నపాటి ట్రైలర్ కట్ చూపించారు. దీనికి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ కి చాలా దగ్గర పోలికలు కనిపించాయి. దీంతో మీ ఎపిసోడ్స్ అన్నీ ఒకసారి చూపించాలని ఈటీవీ విన్ వారు జీ5 వారిని సంప్రదించారట. కానీ వాళ్ళు తమ ఫోన్లకి, మెసేజ్లకి రెస్పాన్స్ ఇవ్వలేదని తెలిపారు.
‘కానిస్టేబుల్ కనకం’ దర్శకుడు 2022 లోనే కథ రిజిస్టర్ చేయించుకున్నాడని, అప్పటి నుండి దీనిపై వర్క్ చేసి.. మరికొద్ది రోజుల్లో తన కంటెంట్ తో ప్రేక్షకులను అలరించాలని తపిస్తున్న టైంలో ఇలా జరగడం దురదృష్టకరమని.. దీనిపై లీగల్ గా కూడా ఫైట్ చేస్తున్నామని.., కాంట్రోవర్సీకి కిలోమీటర్ దూరంలో ఉండే సంస్థ తమదని, కానీ ఈ విషయంలో బాధపడుతున్నామని చెప్పడమే తమ ఉద్దేశం తప్ప మరేమీ లేదని..’ ఈటీవీ విన్ అధినేతలు అయిన నితిన్, సాయి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చలే నడుస్తున్నాయి.