మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ధైర్యమెక్కువ. వాళ్లు వరుసగా తెరకెక్కిస్తున్న సినిమాలు, కుదర్చుకుంటున్న కాంబోలు, పెడుతున్న బడ్జెట్లు, సినిమా పరిశ్రమలోనే నిర్మాణేతర రంగాల్లో వాళ్లు వేస్తున్న అడుగులు చూస్తే ఎవరైనా ఇదే మాట చెబుతారు. అలాంటి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ యలమంచిలి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం అని చెప్పలేం కానీ.. షాకింగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు.
రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా కన్నడ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం బెంగళూరులో ఇటీవల ఘనంగా జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాత రవి శంకర్ డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ ఒక్క సినిమా గురించి, ప్రస్తుతం వాళ్ల బ్యానర్లో రూపొందుతున్న సినిమాలన్నింటి గురించి ఆ స్టేట్మెంట్లో మాట్లాడటం గమనార్హం.
మైత్రీ బ్యానర్ మీద నిర్మితమవుతున్న సినిమాల గురించి చెబుతూ రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ సినిమా చేస్తున్నాం. ‘కాంతారా: ఛాప్టర్ 1’ తర్వాత ఆయన నుండి రాబోతున్న సినిమా ఇదే. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నాం. (డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ఉంది). ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ఇక రామ్చరణ్ – బుచ్చిబాబుతో ‘పెద్ది’ సినిమా తీస్తున్నాం. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా వస్తుంది. పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వచ్చే ఏడాది ఏప్రిల్లో వస్తుంది. ప్రభాస్ – హను రాఘవపూడి ‘ఫౌజీ’ సినిమా కూడా ఉంది అని బ్యానర్ లైనప్ చెప్పారు.

ఇక్కడితో ఆపేసుంటే స్టేట్మెంట్, డేరింగ్ స్టేట్మెంట్ అనే మాట ఉండేది కాదు. తాము ప్రస్తుతం బలమైన కథలతో సినిమాలు చేస్తున్నామని… ఈ ఐదు సినిమాల్లో ఒక్కటి యావరేజ్ అయినా మీరు చెప్పిందే నేను చేస్తాను అని రవి శంకర్ ఛాలెంజ్ చేశారు. మరి ఆయన ధైర్యమేంటో చూడాలి.
