మోహన్లాల్ (Mohanlal) – పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఎల్2 : ఎంపురాన్’ (L2: Empuraan). ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫలితం పట్ల సినిమా టీమ్ కూడా ఆశించినంత ఆనందంగా లేదని చెబుతున్నారు. మరోవైపు సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో వివాదం నెలకొంది. ఈ విషయం గురించి నిర్మాత గోకులం గోపాలన్ స్పందించారు. ఈ వివాదం విషయంపై ఇప్పటికే దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో మాట్లాడానని గోపాలన్ (Gokulam Gopalan) తెలిపారు. అంతేకదు వివాదానికి దారి తీసిన సన్నివేశాలను తొలగించమని కూడా చెప్పానని తెలిపారు.
‘ఎల్ 2: ఎంపురాన్’ (L2 Empuraan) సినిమాలో చూపించిన సన్నివేశం లేదా సంభాషణ ప్రేక్షకుల మనో భావాలను దెబ్బతీసేలా ఉంటే వాటిని మార్చాలని పృథ్వీరాజ్ సుకుమారన్కు చెప్పానని నిర్మాత చెప్పారు. ఇప్పటికే సినిమాలో కొన్ని పదాలను మ్యూట్ చేశామని, అయితే కొన్ని సన్నివేశాలపై ఇంకా వ్యతిరేకత వస్తోందని చెప్పారు. వాటిని కూడా వీలైతే మార్చమని దర్శకుడికి చెప్పానని గోపాలన్ పేర్కొన్నారు. సినిమాకు సెన్సార్ అయిపోయాక అందులో ఎలాంటి ఇబ్బందులు లేవని అర్థం కదా.. కానీ ఇప్పుడు ఇలా అవుతోంది అని ఆయన చిన్నపాటి అసహనం వ్యక్తం చేశారు.
అలాగే తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాల్లేవని, రాజకీయాలను తాను ప్రజలకు సేవ చేసే మార్గంగానే చూస్తానని నిర్మాత చెప్పారు. అలాగే సినిమా విడుదలయ్యాక మార్పులు చేయాల్సి వస్తే.. నిర్మాతకు పెద్ద మొత్తం ఖర్చవుతుందని ఆయన తనవైపు నుండి ఆలోచనను చెప్పుకొచ్చారు. సినిమా ప్రస్తుతం 4000 వేల థియేటర్లలో ప్రదర్శితమవుతోందని, ఇప్పుడు మార్పులు చేస్తే రూ.40 లక్షల వరకూ ఖర్చు అవుతుందని అనుకుంటున్నానని తెలిపారు. అయితే ఒకరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో సినిమాలతో చేయరు అని ముగించారాయన.
ఇంతకీ ఏమైందంటే.. ‘ఎల్ 2: ఎంపురాన్’ సినిమాలో గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను చూపించారు. అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం చూపించారు. కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలతో సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అయితే ఇవి ఓ వర్గాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.