మొన్నీమధ్య రామ్చరణ్ (Ram Charan) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో ఓ సినిమా గురించి పుకారు వచ్చింది మీకు గుర్తుండే ఉంటుంది. సినిమాకు సంబంధించిన దాదాపు చర్చలు పూర్తయ్యాయి అని.. వెంకటేశ్ (Venkatesh) – త్రివిక్రమ్ సినిమా అయ్యాక ఇది స్టార్ట్ చేస్తారు అని ఆ వార్తల సారాంశం. రామ్చరణ్ సన్నిహిత వర్గాలు కూడా ఈ విషయాన్ని దాదాపు కన్ఫామ్ చేశాయి. అయితే ఏమైందో ఏమో ఆ తర్వాత ఈ సినిమా గురించి వార్తలు ఆగిపోయాయి.
అయితే ఇప్పుడు ఓ విషయం బయటకు వచ్చింది. అదే ఆ సినిమా నిర్మాత అప్పుడు చెప్పినట్లు కొత్త వ్యక్తి కాదు అని, సీనియర్ నిర్మాత వారసుడు అని. మీకు కామాక్షి మూవీస్ గుర్తుందా? 1986 నుండి 2013 వరకు ప్రముఖ నిర్మాత శివప్రసాద్ రెడ్డి టాలీవుడ్లో చాలా సినిమాలు తీశారు ఆ బ్యానర్ మీద. అందులో 12 సినిమాలకు హీరో నాగార్జుననే (Nagarjuna). దీంతో ఈ బ్యానర్ని నాగార్జున రెండో బ్యానర్ అనుకునేవారంతా.
అయితే శివప్రసాద్ రెడ్డి, నాగార్జున స్నేహితులు. ఆ అనుబంధంతోనే సినిమాలు అలా చేశారు. అంతేకాదు అక్కినేని కుటుంబానికి చెందిన కొన్ని సినిమాల పంపిణీ కూడా చేశౄరు. అయితే కొన్ని సినిమాల వల్ల నష్టాలు చవిచూశారు. ఈ క్రమంలో నిర్మాణం ఆపేశారు. కొంతకాలం క్రితం ఆయన కన్నుమూశారు. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి తనయుడు చందన్ రెడ్డి సినిమా నిర్మాణ రంగంలోకి దిగుతున్నారట.
ఒకేసారి మూడు సినిమాలు ప్లాన్ చేశారట. కామాక్షి మూవీస్ అనే పేరును కామాక్షి ఎంటర్ప్రైజెస్ అని మార్చి సినిమాలు చేస్తారు అని సమాచారం. పరిశ్రమలో సహ నిర్మాతగా పెద్ద సినిమాలు తీసిన ఓ వ్యక్తి చందన్ రెడ్డితో కలసి నిర్మాణంలో కలసి పని చేస్తారు అని చెబుతున్నారు. అందులో ఒక సినిమా రామ్చరణ్ – త్రివిక్రమ్ సినిమా అని తాజా పుకార్ల సారాంశం. ఇక మిగిలిన రెండు సినిమాలు యువ హీరోలతోనే అని చెబుతున్నారు.