ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పుడు పెద్ద వివాదం తలెత్తింది. సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించడంపై ఇప్పటికే రకరకాల చర్చలు జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమాలోని కథను లీక్ చేసినట్టు వచ్చిన ప్రచారంపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నేరుగా స్పందించాడు. దీపికా పీఆర్ టీం ఇటువంటి డర్టీ పీఆర్ గేమ్స్ చేస్తున్నారని సంచలనంగా ట్వీట్ చేశాడు. ఓ నటికి కథ చెబితే, నమ్మకంతోనే చెబుతానన్న వంగా.. ఇలాంటి చర్యలతో మీరు మీ అసలుతత్వాన్ని బయటపెడుతున్నారు అంటూ ఆగ్రహంగా స్పందించాడు.
ఇప్పటికే పలుమార్లు కథకు సరిపడే కండిషన్స్ పెట్టిన దీపికా పదుకొణె.. స్పిరిట్ సినిమాకు తగదనిపించడంతో ఆమెను తొలగించినట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీను హీరోయిన్గా ఎంపిక చేశారని అధికారికంగా ప్రకటించారు. తక్కువ గంటల పని చేస్తానని, డబ్బు ఎక్కువ కావాలని, ప్రత్యేకంగా వీఐపీ డిమాండ్లు పెట్టినట్టు గాసిప్స్ రావడంతో దీపికకు కథ చెప్పినా, దర్శకుడు చివరికి ఆమెపై నమ్మకాన్ని వదిలేశాడని స్పష్టమైంది.
ఈ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిప్తి డిమ్రీకి ఇది బిగ్ బ్రేక్ అవుతుందని వార్తలు రాగా.. దీపికా పీఆర్ టీం మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కథను లీక్ చేయడమే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీపికను తప్పించి యంగ్ యాక్ట్రెస్కు అవకాశం ఇచ్చారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్రబృందానికి, పీఆర్ టీంల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. ‘‘ఒక నటికి కథ చెప్పినప్పుడు 100 శాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లాంటిది ఉంటుంది. కానీ మీరు కథను లీక్ చేసి మీ స్వభావాన్ని మీరే బయటపెట్టుకున్నారు. ఓ యంగ్ యాక్టర్ను కించపరచడం, కథను బయటపెట్టడం, ఇదేనా మీ ఫెమినిజం? నేను సినిమాకు ఎంతో శ్రమ పెట్టి పనిచేస్తా. మీకు ఇది అర్థం కాదు.. ఎప్పటికీ అర్థం కాదు. స్టోరీ మొత్తం లీక్ చేయండి. నాకు ఏమాత్రం ఫరక్ పడదు’’ అంటూ వంగా తేల్చేశాడు. అలాగే ‘‘ లాంటి పీఆర్ గేమ్స్ మీద అస్సలు రియాక్ట్ కూడా కావడం లేదు’’ అంటూ సందీప్ రెడ్డి వంగా తన పోస్ట్ను ముగించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ డిస్కషన్గా మారింది.