సినీ పరిశ్రమలో చిన్న మాట పెద్ద చర్చగా మారడం కొత్తేమీ కాదు. తాజాగా టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవలోకే చేరాయి. రీసెంట్గా ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు హీరోయిన్స్ పై చేసిన కామెంట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో అనేక రకాల విశ్లేషణలు, విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆయనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరికొందరు వైష్ణవి చైతన్యను టార్గెట్ చేస్తూ మాట్లాడినట్లు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో ఎస్కేఎన్ స్పందిస్తూ, తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ‘‘హాహాహా.. ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి..’’ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ను రీట్వీట్ చేసి తనదైన శైలిలో స్పందించారు. ఆ తరువాత మరింత స్పష్టతనిచ్చేలా వీడియోను రిలీజ్ చేశారు.
‘‘ప్రీ-రిసీజ్ ఫంక్షన్లో సరదాగా చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి చూపించడం బాధగా ఉంది. నిజానికి నేను పరిశ్రమలో ఎక్కువ మంది తెలుగు హీరోయిన్లను పరిచయం చేసిన అతి తక్కువ మంది నిర్మాతల్లో ఒకడిని. రేష్మ, ఆనంది, ప్రియాంక జవాల్కర్, మానస, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత.. వీళ్లందరినీ నా సినిమాల్లో అవకాశాలు కల్పించాను’’ అని అన్నారు.
తన సినిమాల ద్వారా టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నానని, అది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని SKN స్పష్టం చేశారు. “ఇప్పటికే 8-9 మందిని పరిచయం చేశాను. కొత్తగా హారికతో పాటు మరో తెలుగు అమ్మాయిని లాంచ్ చేయబోతున్నా. నా తర్వాతి చిత్రంలో ఆర్ట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రైటర్ కూడా తెలుగమ్మాయే. పరిశ్రమలో స్థానిక ప్రతిభకు నాకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది” అని అన్నారు.
ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, SKN తాను జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించానని, అందుకే పరిశ్రమలో తెలుగు టాలెంట్కి ఎక్కువ అవకాశం కల్పించాలని భావిస్తానని అన్నారు.
“సరదాగా అన్న విషయాన్ని స్టేట్మెంట్ లా చూడొద్దు.. జోక్ ను జోక్ లా చూడండి.. అలాగే 25 మందికి పైగా తెలుగు అమ్మాయిలను పరిచయం చేయడమే నా లక్ష్యం..” అని తెలిపారు. మొత్తానికి SKN వివరణతో ఈ వివాదానికి ముగింపు పడుతుందా? లేక ఇంకా ట్రోలింగ్ కొనసాగుతుందా? అనేది చూడాలి.