టాలీవుడ్లో గత రెండు వారాలు సినిమాల షూటింగ్లు జరగడం లేదనే విషయం తెలిసే ఉంటుంది. వేతనాలు పెంచాలని సినీ కార్మికులు కోరుతూ సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్నారు. దీంతో ఇటు వైపు నిర్మాతలు, దర్శకులు.. ఇటు కార్మికులు ఇబ్బందిపడుతున్నారు. అయినప్పటికీ ఎవరూ సయోధ్యకు రావడం లేదు. అయితే ఈ రోజు ఈ టాలీవుడ్ పంచాయితీ ప్రీ క్లైమాక్స్కి వచ్చింది. అంతేకాదు క్లైమాక్స్ కూడా ఈ రోజే జరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు.
కార్మికులు డిమాండ్ చేసినట్లుగా 30 శాతం కాకపోయినా, 25 శాతం (₹2 వేల లోపు వేతనాలు ఉన్న కార్మికులకు) వేతనాలు పెంచడానికి నిర్మాతలు ఓకే చెప్పారు. మామూలుగా అయితే ఇక్కడితో తేలిపోయేదేమో.. అయితే వేతనాల పెంపు అమలు చేయాలంటే, తాము చెప్పిన వర్కింగ్ కండిషన్లకి ఒప్పుకోవాలనే షరతు పెట్టారు. దీనికి కార్మిక సంఘాలు ఓకే చెప్పకపోవడంతో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో చలన చిత్ర వాణిజ్య మండలి, కార్మిక సంఘాలు, నిర్మాతల మధ్య పలు దఫాలుగా చర్చలు కొనసాగినా విషయం క్లియర్ అవ్వలేదు.
మరోవైపు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్మాతలు, కార్మికులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రెండు వర్గాలూ పట్టు వీడలేదు. దీంతో ఈ వివాదంపై జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాలు, నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం నిర్మాతలతో సమావేశం అయ్యారు. సోమవారం కార్మిక సంఘాలతో మాట్లాడతానని నిర్మాతలకు చెప్పారట. దీంతో ఈ విషయం సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
గతంలోనే ఓసారి నిర్మాతలు చిరంజీవిని కలసి మాట్లాడారు. ఆయన ఈ విషయం తేలడానికి కొస్త సమయం ఇచ్చారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి మరోసారి పెద్ద మనిషి అవతారం ఎత్తాల్సిన అవసరం వచ్చింది. మరి చూడాలి చిరు ఎలా మాట్లాడతారు, ఏం పరిష్కారం లభిస్తుందనేది చూడాలి.