సినిమాకి దర్శకుడిని ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. దర్శకుడు లేకపోతే సినిమానే ఉండదు. అది ఎవరినడిగినా చెప్తారు. అలాంటిది దర్శకుడి పేరే లేకుండా ఓ సినిమా రిలీజ్ అయ్యింది అంటే నమ్ముతారా?వినడానికి విడ్డూరంగా ఉన్నా అది నిజం. మన టాలీవుడ్..లోనే ఈ విచిత్రం చోటుచేసుకుంది. ఆ సినిమా వెనుక జరిగిన కథ, షూటింగ్లో నడిచిన రచ్చ మామూలుగా లేదు. వివరాల్లోకి వెళితే.. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajashekhar), వడ్డే నవీన్ (Vadde Naveen) ప్రధాన పాత్రల్లో ‘శుభకార్యం’ (Subhakaryam) అనే సినిమా వచ్చింది.
2001లో విడుదలైన ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు.రవిరాజా పినిశెట్టి (Ravi Raja Pinisetty) దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. తర్వాత షూటింగ్లో హీరో రాజశేఖర్కు, దర్శకుడు రవిరాజా పినిశెట్టికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తాయి. అవి కాస్తా పెద్దవై దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసేవరకు వెళ్లిందని అప్పట్లో ఫిల్మ్నగర్ టాక్. దీంతో రవిరాజా పినిశెట్టి సినిమాను మధ్యలోనే వదిలేశారట.
అప్పుడు నిర్మాత సి. కళ్యాణ్, ‘బొబ్బిలి వంశం’ ఫేమ్ అదియమాన్ను తీసుకొచ్చి ఎలాగోలా సినిమాను కంప్లీట్ చేశారు. సినిమా కంప్లీట్ అయ్యాక తన పేరునే దర్శకుడిగా వేయాలని రవిరాజా పినిశెట్టి (Ravi Raja Pinisetty) డిమాండ్ చేశారట. కానీ, మధ్యలో వచ్చిన అదియమాన్ కూడా దర్శకత్వం చేశారు. దీంతో ఇద్దరూ హర్ట్ అవ్వకూడదు అని భావించి దర్శకుడి పేరు లేకుండానే ‘శుభకార్యం’ సినిమాని రిలీజ్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఇదో అరుదైన ఘటనగా నిలిచిపోయింది.
అంతేకాదు ఈ సినిమా కథ విషయంలో కూడా చాలా రచ్చ జరిగింది. మొదట్లో ఓ తమిళ సినిమా ఆధారంగా ‘శుభకార్యం’ తీస్తే… అదే లైన్ ను మార్చేసి రచయిత చిన్ని కృష్ణ ‘నరసింహ నాయుడు’ (Narasimha Naidu) గా తీశారని, దీంతో ‘శుభకార్యం’ కథ మార్చాల్సి వచ్చిందని.. అందుకే రవిరాజా పినిశెట్టి హర్ట్ అయ్యి ప్రాజెక్టు నుండి తప్పుకున్నారని అప్పట్లో సి.కళ్యాణ్ చెప్పడం జరిగింది. 2001 లోనే వచ్చిన ‘నరసింహనాయుడు’ ఇండస్ట్రీ హిట్ అయితే.. ‘శుభకార్యం’ మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది.