కొన్ని విషయాలను ఎంత మర్చిపోదామన్నా కుదరదు, మనం ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు గుర్తుచేస్తూ ఉంటారు. ఇప్పుడు దిల్ రాజు (Dil Raju) పరిస్థితి అలానే తయారయ్యింది. పాపం అసలే “గేమ్ ఛేంజర్” డిజాస్టర్ అయ్యి నిర్మాతగా భారీ నష్టాలు చవిచూసిన దిల్ రాజుకు ఆ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి.
“ఎంపురాన్” ఈవెంట్ లో స్టేజ్ మీద ఉన్న దిల్ రాజును (Dil Raju) గేమ్ ఛేంజర్ సినిమా గురించి ప్రశ్నించగా అక్కడ ప్రేక్షకులు సైతం నవ్వడంతో దిల్ రాజు చినబుచ్చుకున్న విషయం అందరూ గమనించారు. ఆ తర్వాత కూడా దిల్ రాజు కనిపిస్తే “గేమ్ ఛేంజర్” విషయం ప్రస్తావిస్తే సున్నితంగా తిరస్కరించడమే కాక, వద్దని వారించారు కూడా.
అలాంటిది ఇవాళ “గద్దర్ అవార్డ్స్” ఈవెంట్ మీద తమన్ (Thaman) పెర్ఫార్మ్ చేస్తూ “గేమ్ ఛేంజర్”లోని “రా మచ్చా” పాట పాడాడు, అప్పుడు దిల్ రాజును స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సిందిగా కోరాడు. పాపం ఈవెంట్ లో తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా హాజరైన దిల్ రాజు ఏం చేయలేక నవ్వి ఊరుకున్నాడు.
దాంతో.. రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులు “అవసరమా?” అంటూ తమన్ (Thaman) ను ప్రశ్నించారు. పుండు మీద కారం జల్లడం అంటే ఇదే మరి. సినిమా రిలీజ్ తర్వాత కూడా తమన్ సినిమాను ఉద్దేశించి అన్న మాటలు, ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చాలామంది మెగా అభిమానులను హర్ట్ చేశాయి. మరి తమన్ ఎంత సరదాగా తీసుకున్నా.. అభిమానుల ఆగ్రహం మాత్రం తప్పలేదు.