బాలీవుడ్లో ఖాన్ (Aamir Khan) త్రయం గురించి కొంతమంది ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. మిగిలిన ఆ కొంతమంది అంతే కోపంగా ఉంటారు. దానికి కారణం వాళ్లు మన దేశానికి సంబంధించి కొన్ని విషయాల మీద రియాక్ట్ అవ్వరు అని, మరికొన్ని విషయాల్లో రియాక్ట్ అయ్యి కామెంట్స్ చేస్తారని. అందులో ఎక్కువగా బ్లేమ్ తీసుకున్న హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan). ఆ మధ్య కొన్నేళ్ల క్రితం ఈ దేశంలో ఉండాలని లేదు అనే కాంటెక్స్ట్లో ఏదేదో మాట్లాడారు. ఆ తర్వాత క్లారిటీ ఇచ్చినా ఆ విషయం ఇంకా రగులుతూనే ఉంటుంది.
తాజాగా పహల్గాం దాడి తర్వాత బాలీవుడ్లో ఖాన్ (Aamir Khan) త్రయం స్పందించకపోవడంపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు వచ్చాయి. ఈ విషయం ఇటీవల ఓ టీవీ షోకి ఆమిర్ వచ్చినప్పుడు ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ సినిమాలో పాకిస్థాన్ను శత్రుదేశంగా తొలుత చూపించింది నా చిత్రంలోనే అని 1999లో తాను నటించిన ‘సర్ఫరోష్’ (Sarfarosh) సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో ‘పదోషి ముల్క్..’ అంటూ దాయాది గురించి చెప్పాననని అన్నారు.
ఆ తర్వాత దేశానికి మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతోనే ‘దంగల్’ (Dangal) ను పాకిస్థాన్లో విడుదల చేసే ఆలోచన కొంతమంది తన ముందుంచినా ఆ పని చేయలేదన్నారు. ‘సర్ఫరోష్’ (Sarfarosh) సినిమా తర్వాత చాలా సినిమాలు పాకిస్థాన్ పేరును ఉపయోగించాయని గుర్తు చేశారు. ఇక పాకిస్థాన్కు వ్యతిరేకంగా తానేమీ మాట్లాడను అని చాలా మంది అనుకుంటారని.. కానీ, ‘సర్ఫరోష్’ (Sarfarosh) సినిమా విడుదలైన తర్వాత పాకిస్థాన్ నుండి నెగెటివ్ కామెంట్స్ వచ్చాయని గుర్తు చేశాడు ఆమిర్ (Aamir Khan).
‘దంగల్’ (Dangal) సినిమాలో డిస్నీ వాళ్లకు కూడా నిర్మాణ భాగస్వామ్యం ఉంది. దీంతో వాళ్లు ఆ సినిమాను పాకిస్థాన్లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సినిమాలో గీతా ఫొగాట్ విజేతగా నిలిచిన తర్వాత ఆ మ్యాచ్లో మువ్వన్నెల జెండా కనిపించకూడదని అక్కడి సెన్సార్బోర్డు సూచించింది. మన జాతీయ గీతం వినిపించకూడదని కూడా షరతులు విధించింది. దీంతో ఈ సినిమా పాకిస్థాన్లో విడుదల చేయకూడదు అని చెప్పేశాను అని ఆమిర్ చెప్పాడు. అలా చేస్తే వ్యాపారంలో నష్టం వస్తుందని డిస్నీ వాళ్లు చెప్పారు. జాతీయ జెండా, గీతం తీసేసి చేసే బిజినెస్, వచ్చే డబ్బులు నాకు వద్దని చెప్పా అని నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు ఆమిర్ (Aamir Khan).